
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పలు సర్కారు బడుల్లో అవసరమైన టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఎందుకు కట్టడం లేదని డీఈవోలపై విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల కింద వీటి నిర్మాణానికి ఆదేశాలిచ్చినా నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో యాదాద్రి, వికారాబాద్ డీఈవోలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
బుధవారం సెక్రటేరియెట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్తో కలిసి డీఈవోలు ఆర్జేడీలతో ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు క్వాలిటీ కోచింగ్ అందించాలనే ఉద్దేశ్యంతో ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నారని గుర్తుచేశారు. వాటిలో అడ్మిషన్లు నామమాత్రంగా ఉన్నాయని, వాటిపై డీఈవోలు ఎందుకు మానిటరింగ్ చేయడం లేదని ప్రశ్నించారు.