నా భార్య వద్దంటే మందు తాగించి..కిరాయి హంతకులతో చంపాలని చూసింది

నా భార్య వద్దంటే మందు తాగించి..కిరాయి హంతకులతో చంపాలని చూసింది
  •   పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

జీడిమెట్ల, వెలుగు: వద్దంటే మద్యం తాగాలని ఒత్తిడి చేసింది.. తాగాక కిరాయి హంతకులతో చంపాలని చూసిందంటూ.. ఓ వ్యక్తి తన భార్యపై బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన నానావత్​ రాందాస్​కు మర్రికుంటకు చెందిన జ్యోతితో 2009లో వివాహమైంది. అనంతరం బతుకుదెరువు కోసం బాలానగర్​వచ్చి, కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి పోలీస్​స్టేషలో జ్యోతి ఆమె భర్త ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటినుంచి రాందాస్​స్వగ్రామంలో ఉంటుండగా జ్యోతి నిజాంపేట్​ రాజీవ్​గృహకల్పలో నివాసం ఉంటూ ప్రగతినగర్ రొట్టెలు విక్రయిస్తోంది. పిల్లలను మర్రిగూడలో తన తల్లి వద్ద ఉంచింది. 

పెద్దల సమక్షంలో కలిసుంటానని చెప్పి..

ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో భర్తతో కలిసుంటానని జ్యోతి ఒప్పుకుంది. తర్వాత దంపతులిద్దరూ రాజీవ్​గృహకల్పలో ఉంటున్నారు.​ శనివారం ఇంట్లో ఉన్న రాందాస్​వద్దకు ఓ వ్యక్తి వచ్చి, మీ భార్య రమ్మంటోందని చెప్పడంతో ఆమె రొట్టెలు విక్రయించే చోటుకు వెళ్లాడు. రాత్రి 9.30 గంటలకు ఓ యువకుడు అక్కడికి వచ్చి మద్యం తాగుదామని రాందాస్​ను పిలిచాడు. 

తాను ఇప్పటికే తాగానని, రానని చెప్పాడు. అయితే తెలిసిన వ్యక్తే కదా వెళ్లు అని భార్య జ్యోతి ఒత్తిడి చేసి పంపింది. దీంతో ఇద్దరూ సాయినగర్​ కమాన్ వద్దనున్న వైన్​ షాప్​లో మద్యం  కొనుగోలు చేశారు. అక్కడినుంచి బౌరంపేట్​లోని ఇందిరమ్మ ఇండ్ల వద్దకు వెళ్లారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. తర్వాత అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి, రాందాస్​పై బీరుసీసాలతో దాడి చేశారు. అతను తప్పించుకొని పారిపోయి, తన సోదరుడికి విషయం చెప్పాడు. 

ఆదివారం ఉదయం తన భార్య పథకం ప్రకారం కిరాయి మనుషులతో తనను హత్య చేయించాలని చూసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా సంఘటన జరిగిన ప్రాంతం దుండిగల్ పీఎస్​ పరిధిలోకి వస్తుండడంతో బాచుపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్​ నమోదు చేసి, కేసును ట్రాన్స్​ఫర్​ చేశారు.