కారుతో గుద్ది.. యాక్సిడెంట్​గా చిత్రీకరించి..

కారుతో గుద్ది.. యాక్సిడెంట్​గా చిత్రీకరించి..
  • కారుతో గుద్ది.. యాక్సిడెంట్​గా చిత్రీకరించి..
  • ఐదేండ్ల తర్వాత హత్య మిస్టరీ ఛేదించిన పోలీసులు
  • వివాహేతర సంబంధమే కారణం 

జైపూర్(భీమారం),వెలుగు: వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కారుతో గుద్ది హత్య చేయించింది.  అప్పుడు యాక్సిడెంట్​గా నమ్మించి తప్పించుకున్నా... ఐదేళ్ల తర్వాత కటకటాల పాలు కావాల్సివచ్చింది. అనూహ్యంగా మలుపు తిరిగిన కేసు వివరాలను మంచిర్యాల జిల్లా జైపూర్​పోలీస్​ స్టేషన్​లో డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి సోమవారం వెల్లడించారు. శ్రీరాంపూర్ కు  చెందిన చర్చి  ఫాస్టర్ కన్నూరి సత్యరాజ్ భార్య మహేశ్వరికి లక్సెట్టిపేటకు చెందిన మరో చర్చి పాస్టర్​ గంగాధర్​తో పరిచయం ఏర్పడింది. కారు అద్దెకు సంబంధించి 2010లో  ఏర్పడిన  పరిచయం  మహేశ్వరి, గంగాధర్​ మధ్య అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం సత్యరాజుకు తెలియడంతో భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. దాంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని మహేశ్వరి భావించింది.  గంగాధర్​కు చెందిన వెహికిల్​తో సత్యరాజ్​ను గుద్ది చంపాలని, యాక్సిడెంట్​లో చనిపోయినట్టు చిత్రీకరించాలని గంగాధర్, మహేశ్వరి, ఆమె తమ్ముడు శ్రీకాంత్​  ప్లాన్ చేశారు. 2016 సెప్టెంబర్ 20న భీమారం మండలం దాంపూర్ చర్చికి వెళ్తున్న సత్యరాజ్​ను  టీఎస్02ఈక్యూ 7776 వెహికిల్​తో గంగాధర్​ వెనుక నుంచి గుద్ది పారిపోయాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లికి చెందిన మల్లారెడ్డికి రూ.50 వేలు ఇచ్చి తానే యాక్సిడెంట్​ చేసినట్టు చెప్పాలని  ఒప్పందం చేసుకున్నారు. అలాగే మల్లారెడ్డి పోలీసులకు సరెండర్​ అయ్యారు. హత్య తరువాత మహేశ్వరి, గంగాధర్​ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన సత్యరాజ్​ తల్లి ఇటీవల పోలీసులకు కంప్లైంట్​ చేసింది. యాక్సిడెంట్​పై అనుమానాలు ఉన్నాయని, సత్యరాజ్​ది హత్య అని ఫిర్యాదు చేయడంతో తిరిగి విచారణ చేశారు. మల్లారెడ్డిని విచారించగా హత్య సంగతి బయట పడింది. నేరం  చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండు కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ప్రెస్​మీట్​లో జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ సంజీవ్, ఎస్సై అశోక్ ఉన్నారు.