- కారుతో గుద్ది.. యాక్సిడెంట్గా చిత్రీకరించి..
- ఐదేండ్ల తర్వాత హత్య మిస్టరీ ఛేదించిన పోలీసులు
- వివాహేతర సంబంధమే కారణం
జైపూర్(భీమారం),వెలుగు: వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కారుతో గుద్ది హత్య చేయించింది. అప్పుడు యాక్సిడెంట్గా నమ్మించి తప్పించుకున్నా... ఐదేళ్ల తర్వాత కటకటాల పాలు కావాల్సివచ్చింది. అనూహ్యంగా మలుపు తిరిగిన కేసు వివరాలను మంచిర్యాల జిల్లా జైపూర్పోలీస్ స్టేషన్లో డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి సోమవారం వెల్లడించారు. శ్రీరాంపూర్ కు చెందిన చర్చి ఫాస్టర్ కన్నూరి సత్యరాజ్ భార్య మహేశ్వరికి లక్సెట్టిపేటకు చెందిన మరో చర్చి పాస్టర్ గంగాధర్తో పరిచయం ఏర్పడింది. కారు అద్దెకు సంబంధించి 2010లో ఏర్పడిన పరిచయం మహేశ్వరి, గంగాధర్ మధ్య అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం సత్యరాజుకు తెలియడంతో భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. దాంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని మహేశ్వరి భావించింది. గంగాధర్కు చెందిన వెహికిల్తో సత్యరాజ్ను గుద్ది చంపాలని, యాక్సిడెంట్లో చనిపోయినట్టు చిత్రీకరించాలని గంగాధర్, మహేశ్వరి, ఆమె తమ్ముడు శ్రీకాంత్ ప్లాన్ చేశారు. 2016 సెప్టెంబర్ 20న భీమారం మండలం దాంపూర్ చర్చికి వెళ్తున్న సత్యరాజ్ను టీఎస్02ఈక్యూ 7776 వెహికిల్తో గంగాధర్ వెనుక నుంచి గుద్ది పారిపోయాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లికి చెందిన మల్లారెడ్డికి రూ.50 వేలు ఇచ్చి తానే యాక్సిడెంట్ చేసినట్టు చెప్పాలని ఒప్పందం చేసుకున్నారు. అలాగే మల్లారెడ్డి పోలీసులకు సరెండర్ అయ్యారు. హత్య తరువాత మహేశ్వరి, గంగాధర్ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన సత్యరాజ్ తల్లి ఇటీవల పోలీసులకు కంప్లైంట్ చేసింది. యాక్సిడెంట్పై అనుమానాలు ఉన్నాయని, సత్యరాజ్ది హత్య అని ఫిర్యాదు చేయడంతో తిరిగి విచారణ చేశారు. మల్లారెడ్డిని విచారించగా హత్య సంగతి బయట పడింది. నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండు కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ప్రెస్మీట్లో జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ సంజీవ్, ఎస్సై అశోక్ ఉన్నారు.