కరోనాతో చనిపోయిన భర్త చివరి కోరిక తీర్చిన భార్య

కరోనాతో చనిపోయిన భర్త చివరి కోరిక తీర్చిన భార్య

కరోనా బారిన పడి ప్రజలే కాదు.. వారికి సేవచేసిన వైద్యులు కూడా మరణిస్తున్నారు. అలా మరణించిన ఓ వైద్యుడి చివరి కోరికను అతని భార్య తీర్చింది. తమిళనాడుకు చెందిన సైమన్ హెర్క్యులస్ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా రోగులకు చికిత్స చేస్తూ అతను కూడా కరోనా బారిన పడ్డాడు. ఎంతోమందిని కాపాడిన ఆయన మాత్రం కరోనా నుంచి తప్పించుకోలేకపోయాడు. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. దాంతో అధికారులు సైమన్ మృతదేహాన్ని కవర్ లో పెట్టి ఖననం చేశారు.

అయితే సైమన్ భార్య ఆనందీ సైమన్ తమిళనాడు సీఎంకు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. తన భర్త చివరి కోరిక ప్రకారం.. తమ మత ఆచారం ప్రకారం సైమన్ మృతదేహం ఖననం చేయడానికి అనుమతి ఇవ్వాలని సీఎం పళనిస్వామికి ఒక వీడియో రిక్వెస్ట్ పంపారు. దానికి స్పందించిన అధికార యంత్రాంగం.. ఆనందీ అభ్యర్థన, సైమన్ కోరిక మేరకు.. సైమన్ మృతదేహాన్ని మళ్లీ బయటకు తీసి.. కిల్పాక్ శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కానీ, అక్కడ స్థానికులు మాత్రం సైమన్ మృతదేహాన్ని కిల్పాక్ శ్మశానవాటికలో ఖననం చేయకుండా అడ్డుకున్నారు. దాంతో చేసేదేమీ లేక.. సైమన్ మృతదేహాన్ని మరో శ్మశానవాటికలో ఖననం చేశారు. ఎంతోమందిని కాపాడిన డాక్టర్ మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై పోలీసు కమిషనర్ ఎకే. విశ్వనాథ్ మాట్లాడుతూ.. నిరసనకారులపై గూండా చట్టం కింద కేసు నమోదు చేస్తామని, ప్రజలు నిరసనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ మాట్లాడుతూ.. ‘కరోనా రోగుల చికిత్సలో పనిచేస్తూ చనిపోయిన డాక్టర్ మృతదేహాన్ని ఖననం చేయడానికి స్థానిక ప్రజలు ఒప్పుకోకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. కరోనా నియంత్రణలో పనిచేస్తున్న వారిని అభినందించాలి. అటువంటి వారికి వీలైనంత సాయం చేయాలి’ అని అన్నారు.

ప్రస్తుతం తమిళనాడులో 1596 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 20,328 మంది కరోనా కేసులు నమోదుకాగా.. 652 మంది చనిపోయారు.

For More News..

ఆటలో గొడవ.. ఒకరిని చంపి కాల్చేసిన స్నేహితులు

ఆట అంటే వీళ్ళది.. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి టెన్నిస్.. వీడియో వైరల్

‘కరోనా జంతువుల నుంచే వచ్చింది.. ల్యాబ్ నుంచి కాదు’