సంబంధం లేకుండానే కవితకు సీబీఐ నోటీసులిస్తుందా ? : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సంబంధం లేకుండానే కవితకు సీబీఐ నోటీసులిస్తుందా ? : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ముందస్తుకు పోతారేమో తెలియదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి : నిప్పు లేనిదే పొగ వస్తుందా..? అలాగే ఏ సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇస్తుందా..? అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని ఆరోపించారు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తూ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ తుగ్లక్ మాదిరిగా ఎప్పుడు ఏం చేస్తారో..? ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. ముందస్తుకు పోతారేమో కూడా తెలియదన్నారు. 

అప్పుడే కేసీఆర్ కు మతి స్థిమితం పోయింది

నలుగురు ఎమ్మెల్యేలను కొని బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపించినప్పుడే ఆయనకు మతి స్థిమితం పోయినట్లు అర్థమవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తమ కుటుంబంపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న విషయాన్ని..మునుగోడు ఉప  ఎన్నిక నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని కేసీఆర్ తెర ముందుకు తెచ్చారని ఆరోపించారు. నిప్పులేనిదే పొగ వస్తుందా..? ఏ సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులిస్తుందా..? అని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ తన స్వార్థం కోసం అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబ నియంత పాలనను అంతమొందించడానికి బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఉనికి లేకుండా చేశారని విమర్శించారు. కమ్యూనిస్టు తోక పార్టీలన్న కేసీఆర్ వంచనే ఇప్పుడు ఆ పార్టీలు చేరాయని, కేసీఆర్ తోనే తమ భవిష్యత్తని భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అవీనితికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం..రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేంద్రం కూడా కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.