ఇప్పటికీ స్పందించని సర్కార్
ప్రభుత్వంపై హెల్త్ స్టాఫ్ అసంతృప్తి
నిరసన చేపట్టాలని ఆలోచనలు
హైదరాబాద్, వెలుగు: కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు,హెల్త్ స్టాఫ్ రాష్ట్ర తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ మరణిస్తున్నహెల్త్ స్టాఫ్ కు ఆర్థికంసాయం అందజేయక పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కరోనా పేషెంట్లకు సేవలందిస్తూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది హెల్త్ స్టాఫ్ మరణించారు.వారిలో ఒక డాక్టర్, ఒక నర్సు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, మరో ఇద్దరు క్లాస్ 4 సిబ్బంది ఉన్నారు. వీళ్ల కుటుంబాలను ఆదుకోవాలని డాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్తగూడెంకు చెందిన డాక్టర్ నరేష్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా, ఇంటి స్థలం ఇవ్వాలని, ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కానీ ఈ డిమాండ్పై ఇప్పటి వరకు సర్కార్ స్పందించలేదు. డిమాండ్ ను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఈటల చెప్పినా, స్పష్టమైన హామీ మాత్రం రాలేదని డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లైఫ్ రిస్క్ చేసి సర్వీస్ చేస్తున్న తమ పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి లాలూ ప్రసాద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ నరేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు తామే తలో కొంత జమ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు . నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలనే డిమాండ్ పై రెండ్రోజుల పాటు నిరసనలు చేపట్టాలని డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భావిస్తున్నారు . దీనిపై రాష్ట్రంలోని ప్రభుత్వ డాక్టర్ల అభిప్రాయాన్ని కోరినట్టు డాక్టర్స్ అసోసి యేషన్ లీగల్ ప్రెసిడెంట్ డాక్టర్ పల్లం ప్రవీణ్ తెలిపారు. దీనికి డాక్టర్లంతా ఓకే చెప్పారని, అవసరమైతే చలో భద్రాచలం చేపడతామని వెల్లడించారు.
కేంద్ర సాయమే దిక్కు..
కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, హెల్త్ స్టాఫ్లో ఎవరైనా వైరస్ బారినపడి చనిపోతే కేంద్రం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తోంది. రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఈ సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో చనిపోయిన డాక్టర్, హెల్త్ స్టాఫ్కు రూ.50 లక్షల చొప్పున కేంద్రం అందించనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వమూ కొంత సాయం చేయాలని హెల్త్ స్టాఫ్ కోరుతున్నా.. సర్కార్ సప్పుడు చేయట్లేదు.