షోకాజ్ నోటీసులకు త్వరలో సమాధానం

షోకాజ్ నోటీసులకు త్వరలో సమాధానం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ పంపిన షోకాజ్ నోటీసులకు త్వరలోనే సమాధానం పంపిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఆయన బుధవారం గోషామహల్ లో మీడియాతో మాట్లాడారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని, పార్టీ తనను వదులుకోదని భావిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.

తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని, తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కోర్టు పరిమితుల కారణంగా ఎక్కువగా మాట్లాడలేనని రాజాసింగ్ తెలిపారు. మహ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. అలాగే 10 రోజుల్లో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.