ఐటీ మినహాయింపు కోసం కృషి చేస్తా : గడ్డం వంశీకృష్ణ

ఐటీ మినహాయింపు కోసం కృషి చేస్తా : గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని : తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని పెద్దపల్లి  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇవాళ రామగుండం  ఓసీపీ 3 కృషి భవన్ లో కాంగ్రెస్ పార్టీ, ఐఎన్ టీయూసీ ఆధ్వర్యంలో  నిర్వహించిన బాయి బాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐఎన్ టీయూసీ నాయకుడు  జనక్ ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాకా వెంకట స్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమన్నారు. లేబర్ నాయకుడిగా కార్మిక సమస్యలపై పోరాడని తెలిపారు. 

 సింగరేణి నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాకా కాపాడారన్నారు. రాష్టాన్ని బీఆర్ఎస్  అప్పులపాలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని ఆరోపించారు.  సింగరేణిలో ఒక కొత్త బొగ్గు గనిని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.  సంస్థకు రావలసిన 30 వేల కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాలని డిమాండ్​ చేశారు. సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు కోసం కృషి చేస్తామన్నారు.   ఎంపీగా అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. 

నరేంద్రమోదీ ఓ రావణాసురుడు 

రాముడి జపం చేస్తున్న దేశ ప్రధాని నరేంద్రమోదీ ఓ రావణాసురుడు అని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.  దేశాన్ని లంకను చేసి భారతమాతను మోదీ బంధించడాన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న  మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలపునిచ్చారు.  మోడీని, కేడీని పాతాళ లోకానికి తొక్కాలన్నారు.   సింగరేణిని కాపాడిన కాకా వెంకటస్వామి మనువడు వంశీ కృష్ణ ను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.  సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. 

చందాలు వేసుకొని ఎమ్మెల్యే గా గెలిసిన ఈశ్వర్ కుప్పలు కుప్పలుగా డబ్బులను ఎలా సంపాదించాడని నిలదీశారు. ప్రజల సొమ్మును దోచుకున్నది సరిపోక మళ్లీ ఎంపీగా ప్రజల ముందుకు కొప్పుల వస్తున్నడాని మండిపడ్డారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుని సింగరేణిని ప్రవేట్ పరం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్  రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నామన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి, చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించాలని కోరారు.