ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీతో అదనంగా 20 వేల కోట్ల రెవెన్యూ

ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీతో అదనంగా 20 వేల కోట్ల రెవెన్యూ

ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీతో అదనంగా 20 వేల కోట్ల రెవెన్యూ

రెవెన్యూ సెక్రటరీ సంజయ్​ మల్హోత్రా

న్యూఢిల్లీ : ఆన్​లైన్​గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ విధించాలనే జీఎస్​టీ కౌన్సిల్​ నిర్ణయంతో ప్రభుత్వానికి అదనంగా రూ. 20 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని రెవెన్యూ సెక్రటరీ సంజయ్​ మల్హోత్రా వెల్లడించారు. ఆన్​లైన్​ గేమింగ్​, కాసినో, హార్స్ ​రేసింగ్​లపై 28 శాతం చొప్పున జీఎస్​టీ అమలు చేయాలని జీఎస్​టీ కౌన్సిల్​ ఇటీవల ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలోని ట్యాక్స్​ డిమాండ్ల కింద మొత్తాన్ని రికవరీ చేసేందుకు సుప్రీం కోర్టులో కేసులను ప్రభుత్వం కొనసాగించనున్నట్లు కూడా రెవెన్యూ సెక్రటరీ చెప్పారు. సామాన్య ప్రజలు  ఫుడ్​ ఐటమ్స్​పై 5 శాతం జీఎస్​టీ చెల్లిస్తుంటే, ఆన్​లైన్​ గేమింగ్​ పరిశ్రమ మాత్రం ఇప్పటిదాకా కేవలం 2–3 శాతం జీఎస్​టీ చెల్లిస్తోందని పేర్కొన్నారు. జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​లో ఒక సభ్యుడు ఇదే అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. ఆన్​లైన్​ గేమ్​లపై 18 శాతం చొప్పున జీఎస్​టీని ఆన్​లైన్ ​గేమింగ్​ కంపెనీలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నా, ఆ జీఎస్​టీని గ్రాస్​ గేమింగ్​ రెవెన్యూ (జీజీఆర్) ​పై చెల్లిస్తుండడంతో నిజానికి 2–3 శాతమే అవుతుందని ఆ సభ్యుడు వివరించినట్లు రెవెన్యూ సెక్రటరీ చెప్పారు.

కిందటేడాది రెవెన్యూ రూ. 1,700 కోట్లే...

ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీల ఫుల్ ​వాల్యూపై జీఎస్​టీ వసూలు చేస్తే కిందటేడాది ప్రభుత్వానికి రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని, కానీ 2022–23 లో రూ. 1,700 కోట్ల రెవెన్యూ మాత్రమే వచ్చిందని సంజయ్​ మల్హోత్రా వివరించారు. ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలు ఇప్పటిదాకా చెల్లిస్తూ వస్తున్న జీఎస్​టీ చాలా తక్కువ రేటని పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న వసూళ్ల కంటే 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా వసూలు కావల్సి ఉంటుందని వివరించారు. ఆన్​లైన్​  గేమింగ్​ ట్రాన్సాక్షన్లు ఇప్పుడున్నట్లుగానే కొనసాగితే ప్రభుత్వానికి ఏటా రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల దాకా ఆదాయం పెరుగుతుందని అన్నారు. గేమ్​ఆఫ్​ స్కిల్​, గేమ్​ ఆఫ్​ ఛాన్స్​ల మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ, దానిని ఆన్​లైన్ ​గేమింగ్​ కంపెనీలు అడ్వాంటేజ్​గా మలుచుకున్నాయని, ఫలితంగా జీజీఆర్​పై 18 శాతం మాత్రమే జీఎస్​టీ చెల్లించేవని రెవెన్యూ సెక్రటరీ వివరించారు. ఎంత మొత్తమైతే బెట్స్​ ఉంటాయో అంత మొత్తం మీద 28 శాతం చొప్పున  జీఎస్​టీ చెల్లించాల్సిందేనని ఇటీవలి జీఎస్​టీ కౌన్సిల్​ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఎక్కడైనా పన్ను ఎగవేతకు పాల్పడితే, పరిశీలించి ఆ పన్ను మొత్తాన్ని రికవరీ చేస్తామని వెల్లడించారు. గతంలో  హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టులో అపీల్​కు వెళ్లనున్నామని కూడా రెవెన్యూ సెక్రటరీ స్పష్టం చేశారు. ఎక్కువ రేటుతో జీఎస్​టీ వసూలు చేయాలనే తమ నిర్ణయం కూడా సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి ఉండాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే అధిక రేటుతో జీఎస్​టీ రికవర్​ చేయలేమని చెప్పారు. 

సుదీర్ఘమైన డిస్కషన్స్​ తర్వాతే.....

అధిక రేటుతో జీఎస్​టీ విధింపు నిర్ణయంపై ఆన్​లైన్ గేమింగ్​ కంపెనీల అభ్యంతరాల గురించి మాట్లాడుతూ, కౌన్సిల్​ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుందని, చాలా డిస్కషన్​ తర్వాతే నిర్ణయం తీసుకుందని రెవెన్యూ సెక్రటరీ వివరించారు. ఆన్​లైన్​ గేమింగ్​పై జీఎస్​టీ పెంపు ప్రపోజల్​పై రెండు, మూడేళ్లపాటు సుదీర్ఘ డిస్కషన్​ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.