
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీతో అదనంగా 20 వేల కోట్ల రెవెన్యూ
రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ : ఆన్లైన్గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ప్రభుత్వానికి అదనంగా రూ. 20 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలోని ట్యాక్స్ డిమాండ్ల కింద మొత్తాన్ని రికవరీ చేసేందుకు సుప్రీం కోర్టులో కేసులను ప్రభుత్వం కొనసాగించనున్నట్లు కూడా రెవెన్యూ సెక్రటరీ చెప్పారు. సామాన్య ప్రజలు ఫుడ్ ఐటమ్స్పై 5 శాతం జీఎస్టీ చెల్లిస్తుంటే, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ మాత్రం ఇప్పటిదాకా కేవలం 2–3 శాతం జీఎస్టీ చెల్లిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఒక సభ్యుడు ఇదే అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. ఆన్లైన్ గేమ్లపై 18 శాతం చొప్పున జీఎస్టీని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నా, ఆ జీఎస్టీని గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్) పై చెల్లిస్తుండడంతో నిజానికి 2–3 శాతమే అవుతుందని ఆ సభ్యుడు వివరించినట్లు రెవెన్యూ సెక్రటరీ చెప్పారు.
కిందటేడాది రెవెన్యూ రూ. 1,700 కోట్లే...
ఆన్లైన్ గేమింగ్ కంపెనీల ఫుల్ వాల్యూపై జీఎస్టీ వసూలు చేస్తే కిందటేడాది ప్రభుత్వానికి రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని, కానీ 2022–23 లో రూ. 1,700 కోట్ల రెవెన్యూ మాత్రమే వచ్చిందని సంజయ్ మల్హోత్రా వివరించారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ఇప్పటిదాకా చెల్లిస్తూ వస్తున్న జీఎస్టీ చాలా తక్కువ రేటని పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న వసూళ్ల కంటే 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా వసూలు కావల్సి ఉంటుందని వివరించారు. ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్లు ఇప్పుడున్నట్లుగానే కొనసాగితే ప్రభుత్వానికి ఏటా రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల దాకా ఆదాయం పెరుగుతుందని అన్నారు. గేమ్ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ల మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతూ, దానిని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అడ్వాంటేజ్గా మలుచుకున్నాయని, ఫలితంగా జీజీఆర్పై 18 శాతం మాత్రమే జీఎస్టీ చెల్లించేవని రెవెన్యూ సెక్రటరీ వివరించారు. ఎంత మొత్తమైతే బెట్స్ ఉంటాయో అంత మొత్తం మీద 28 శాతం చొప్పున జీఎస్టీ చెల్లించాల్సిందేనని ఇటీవలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఎక్కడైనా పన్ను ఎగవేతకు పాల్పడితే, పరిశీలించి ఆ పన్ను మొత్తాన్ని రికవరీ చేస్తామని వెల్లడించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టులో అపీల్కు వెళ్లనున్నామని కూడా రెవెన్యూ సెక్రటరీ స్పష్టం చేశారు. ఎక్కువ రేటుతో జీఎస్టీ వసూలు చేయాలనే తమ నిర్ణయం కూడా సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి ఉండాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే అధిక రేటుతో జీఎస్టీ రికవర్ చేయలేమని చెప్పారు.
సుదీర్ఘమైన డిస్కషన్స్ తర్వాతే.....
అధిక రేటుతో జీఎస్టీ విధింపు నిర్ణయంపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీల అభ్యంతరాల గురించి మాట్లాడుతూ, కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుందని, చాలా డిస్కషన్ తర్వాతే నిర్ణయం తీసుకుందని రెవెన్యూ సెక్రటరీ వివరించారు. ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీ పెంపు ప్రపోజల్పై రెండు, మూడేళ్లపాటు సుదీర్ఘ డిస్కషన్ జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.