
టీఎస్పీఎస్సీ వైపల్యం మరోసారి బయటపడింది. అప్లై చేయకుండానే ఓ విద్యార్థినికి గ్రూప్-1 హాల్ టికెట్ జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ కు చెందిన జక్కుల సుచిత్ర అనే విద్యార్థిని గ్రూప్-3,గ్రూప్-4 లకు మాత్రమే అప్లై చేయగా, గ్రూప్-1 హాల్ టికెట్ కూడా జారీ చేసినట్లు తెలిపింది.
అప్లై చేయకుండానే తనకు హాల్ టికెట్ రావడం పట్ల విద్యార్థిని ఆందోళన చెందినట్లు తెలిపింది. ఒకవేళ హాల్ టికెట్ వచ్చినందుకు సంతోషించి.. పరీక్షా కేంద్రానికి వెళ్లినా అక్కడ ఒఎంఆర్ షీట్ ఉంటుందో? లేదో? తెలియదు కనుక వెళ్లలేదని విద్యార్థిని తండ్రి జక్కుల శ్రీధర్ మీడియాకు తెలిపారు. పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించే టీఎస్పీఎస్సీ, ఇలాంటి తప్పిదాల పట్ల ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదో తెలపాలని ఆయన మీడియాను కోరారు.
కాగా, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 3,80,081 మంది గ్రూప్-1కు దరఖాస్తు చేసుకోగా.. 3,09,323 మంది అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక ఇవాళ జరిగిన పరీక్షకు 2,33,248 మంది హాజరైనట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.