
- మిషన్ భగీరథ పైపు పగలడంతో గుంతలో నిలిచిన నీళ్లు
- అనాథలైన ముగ్గురు చిన్నారులు
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా సురంగల్ గ్రామ శివారులో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో తవ్విన గుంతలో నిలిచిన నీటిలో ప్రమాదవశాత్తు పడి ఓ మహిళ మృతిచెందింది. రంగారెడ్డి జిల్లాలో టీఎస్పీఏ (తెలంగాణ పోలీస్ అకాడమీ) జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ వరకు హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. మొయినాబాద్సమీపంలోని అమ్మాపూర్ చౌరస్తా -సురంగల్ రోడ్డును లింకు కలుపుతూ తాజ్ హోటల్ వరకు బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. సురంగల్ రోడ్డు వద్ద చేపడుతున్న బైపాస్ పనుల్లో పెద్ద గుంత తవ్వారు. రెండు రోజులుగా రాత్రి సమయంలో పనులు జరుగుతున్నాయి.
సురంగల్- శ్రీరాంనగర్- ముర్తుజాగూడ గ్రామాలకు వెళ్లే మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో అక్కడ ఉన్న గుంతలో నీళ్లు నిలిచాయి. ఆ రోడ్డు పక్కనే గుడిసె వేసుకుని ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్న ఓ మహిళ బట్టలు ఉతకడానికి నీటి గుంత వద్దకు వెళ్లింది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో జారిపడి బురదలో ఇరుక్కుపోయి చనిపోయింది. మహిళకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తల్లి మరణంతో ముగ్గురు అనాథలయ్యారు. సదరు మహిళ రోడ్డుపక్కన గుడిసె వేసుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. అనాథలైన చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలవాలని, మహిళ మృతికి కారణమైన వారిని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.