సూర్యాపేట, వెలుగు: అమ్మా.. అమ్మా అని పిలిచినా తల్లి ఎంతకీ పలకలేదు. తల్లి చనిపోయిందని తెలియక మూడేళ్ల చిన్నారి అలాగే పిలుస్తూ అలసి ఆమె పక్కనే పడుకుని నిద్రపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. బస్స్టాండ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందనే సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఆమెకు 30 ఏండ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మహిళ వివరాలేవీ లభించలేదు. ఆమె పక్కనే కూతురు ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చిన్నారిని ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. అమ్మ చనిపోయిందని స్థానికులు చెబుతున్నా బతికే ఉందంటూ పాప తల్లిని గట్టిగా పట్టుకోవడం అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.