హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధి లో గల మల్లాపూర్ లో జరిగింది. ఆమె మృతికి అత్తింటివారి వేధింపులే కారణమని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బ్రహ్మపురి కాలనీలో నివాసం ఉండే మెరుపటి రమాదేవి చిన్న కూతురు ప్రవళిక రెడ్డి(23)కి భవానీ నగర్, మల్లాపూర్ కు చెందిన P.సతీష్ రెడ్డి తో 2017 సం.లో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో బాగానే చూసుకున్నా.. ఆ తర్వాత అత్తింటి వారు ఆమెను వేధిస్తుండేవారు.
అయితే మంగళవారం నాడు తన కూతురు ప్రవళిక అనుమానాస్పద స్థితిలో స్పృహ కోల్పోయిందని రమాదేవికి సమాచారం వచ్చింది. అది విన్న వెంటనే కూతురు ఇంటికి చేరుకొని, ఆమెను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ తరలించగా.. ప్రవళిక అప్పటికే మృతి చెందినదని డాక్టర్లు తెలిపారు
ప్రవళిక మృతికి ఆమె భర్త, అత్తింటివారు పెట్టిన వేదింపులే కారణమని ఆమె తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్త సతీష్ రెడ్డి, అత్త అరుణ, ఆడపడుచులు స్వాతి, ఝాన్సి కలిసి సూటిపోటి మాటలతో వేధిస్తూ, పుట్టింటి నుండి కట్నం డబ్బులు తెమ్మని ప్రవళిక ను వేదిస్తుండేవారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నాచారం సీఐ మహేష్ తెలిపారు.