- తమిళనాడులోని చెన్నై నగరంలో ఘటన
చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళకు వచ్చిన పార్సిల్ కలకలం సృష్టించింది. సిటీలోని ప్యారీస్ కార్నర్ ప్రాంతంలో ఉన్న ఓ హార్డ్వేర్ షాపునకు శుక్రవారం ఓ పార్సిల్ వచ్చింది. దానిని తెరిచి చూడగా అందులో మనిషి పుర్రె, మూడు ఎముకలు, మరో ప్యాకెట్లో బూడిద ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. స్థానికంగా ఉన్న ఒక హార్డ్వేర్ షాపులో పనిచేసే మహిళకు ఒక పార్సిల్ వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. షాప్ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న కృష్ణ లాల్ (59)కు ఈ పార్సిల్ అందజేశాడు. ఆ పార్సిల్ అదే షాపులో అకౌంటెంట్గా పనిచేస్తున్న శ్రుతి పేరు మీద ఉంది.
సెక్యూరిటీ గార్డు ఆమెకు ఫోన్ చేసి, పార్సిల్ వచ్చిందని చెప్పగా, తనకు ఎలాంటి పార్సిల్ రావాల్సి లేదని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో సెక్యూరిటీ గార్డు.. ఇతర ఉద్యోగులు పార్సిల్ను విప్పి చూడగా, అందులో మనిషి పుర్రె, ఎముకలు, బూడిద ప్యాకెట్ కనిపించడంతో అందరూ షాక్ గురయ్యారు.
దీంతో సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఆస్థికలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆ పార్సిల్ ఎవరు పంపారు? ఎందుకు పంపారు? అనే కోణంలో విచారణ చేపట్టారు. పార్సిల్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
