భర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్

భర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ మహిళ తన భర్త, బావమరిదిని కాల్చిచంపింది. ఈ ఘటన జనవరి 1న చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, బద్‌నగర్ తహసీల్ పరిధిలోని ఇంగోరియాలో ఉదయం 10 గంటలకు ఆశా వర్కర్ సవితా కుమారియా తన భర్త రాధేశ్యామ్, బావమరిది ధీరజ్, అలియాస్ దినేష్‌లపై కాల్పులు జరిపింది. రాధేశ్యామ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు మాత్రం కిందపడిపోయాడు.

మహిళ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కుటుంబ సభ్యులపై కూడా దాడికి యత్నించిందని, అయితే ఆమె పిస్టల్‌లో బుల్లెట్స్ అయిపోవడంతో అక్కడ్నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హత్య చేసిన తర్వాత మహిళ పిస్టల్‌తో ఇంగోరియా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూడు నాలుగు నెలల క్రితం కూడా కుటుంబంలో గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతుండగా.. ఇదే విషయమై రెండు మూడేళ్లుగా వివాదం నడుస్తున్నట్టు సమాచారం. మహిళకు ఇద్దరు పిల్లలు. పెద్ద కూతురు వయసు 18 ఏళ్లు, కొడుకు వయసు 15 ఏళ్లు. రీసెంట్ గా జరిగిన ఈ హత్య ఆ ప్రాంత వాసుల్లో విషాదాన్ని నింపింది.