
కేటిదొడ్డి, వెలుగు : పిల్లలతో కలిసి ఉంటున్న ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పాతపాలెంలో సోమవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, అనిత (26) భార్యాభర్తలు. ఆంజనేయులు ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటుండగా.. అనిత ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లోనే పడుకున్న అనిత సోమవారం ఉదయం ఎంతకూ లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికే చనిపోయి కనిపించింది. వెంటనే బంధువులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి అనిత డెడ్బాడీని పరిశీలించగా.. గొంతు చుట్టూ గాయాలు కనిపించడం, తాడుతో బిగించి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డాగ్స్క్వాడ్తో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తమ్ముడు అశోక్కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కేటీ.దొడ్డి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అయితే నెల రోజుల కింద పక్కింటి వారితో గొడవ జరిగిందని, ఆ కేసు రాజీ చేసుకోవాలని తన అక్కపై ఒత్తిడి తెచ్చారని, ఇందుకు ఒప్పుకోకపోవడంతో వారే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.