- అమెరికాలో ఆసక్తికర ఘటన
వాషింగ్టన్ : అమెరికాలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిన లారెన్ కెనడే అనే ఓ మహిళ.. 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికింది. అంతేగాక.. స్పృహలో లేని ఆ 24 నిమిషాల్లో తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో ఆమె.. సోషల్ మీడియా సైట్ రెడిట్ ద్వారా యూజర్లతో పంచుకుంది. చనిపోయిన తర్వాత అపారమైన ప్రశాంతత పొందినట్లు పేర్కొంది.
గత ఫిబ్రవరిలో నాకు గుండెపోటు వచ్చింది. నా భర్త 911కి కాల్ చేసి.. నాకు సీపీఆర్ చేశాడు. డాక్టర్స్ వచ్చి నేను చనిపోయినట్లు చెప్పారు. కానీ 24 నిమిషాల తర్వాత నేను మళ్లీ బతికాను. వెంటనే కోమాలోకి వెళ్లిపోయాను. 2 రోజులకు స్పృహలోకొచ్చాను. కానీ పాత విషయాలు గుర్తుకు రాలేదు. మెదడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చాను" అని లారెన్ కెనడే వివరించారు.
కాంతి కనిపించలేదు
చనిపోయిన తర్వాత ఏం జరిగిందో గుర్తుందా? అని ఓ యుజర్ అడిగిన ప్రశ్నకు లారెన్ స్పందిస్తూ.."గుర్తుంది. మరణానంతరం నేను అపారమైన శాంతిని అనుభవించాను. ఆ టైంలో బాధలన్నీ మరచి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు అనిపించింది. అందరూ చెప్పినట్లుగా ప్రకాశవంతమైన కాంతి ఏమీ నాకు కనిపించలేదు. ఇప్పుడు నాకు చావు అంటే ఏమాత్రం భయం లేదు" అని లారెన్ కెనడే చెప్పారు.
కాగా..కెనడే కేసు ఆసక్తికరంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. చనిపోయి బతికిన చాలా మంది వ్యక్తులు ఎక్కువ కాలం జీవించలేరని తెలిపింది.1982 నుంచి 2018 మధ్య ఇలాంటి కేసులు 65 నమోదయ్యాయని..అందులో 18 మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది.