పాపం.. సంతానం కోసం ఆసుపత్రికి వెళితే.. ప్రాణమే పోయింది..

పాపం..  సంతానం కోసం ఆసుపత్రికి వెళితే.. ప్రాణమే పోయింది..
  • కొండాపూర్ లోని ఫెర్టిలిటీ సెంటర్​లో వికటించిన వైద్యం 
  • గర్భసంచిలో నీటి బుడగలు 
  •  ఉన్నాయంటూ సర్జరీ 
  • సక్సెస్​ అయ్యిందన్న కాసేపటికే కన్నుమూత

 గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్​కు పిల్లల కోసం వెళ్లిన మహిళ ​వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన నరేశ్ కు , సత్తుపల్లికి చెందిన పల్లవి(29)తో నాలుగేండ్ల కింద పెండ్లయ్యింది. ఇద్దరూ  కూకట్ పల్లి లో ఉంటున్నారు. నరేశ్​ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్​ జాబ్ ​చేస్తున్నాడు. దంపతులకు పిల్లలు కలగకపోవడంతో కొండాపూర్ లోని ఫెర్టిలిటీ సెంటర్ ను సంప్రదించారు. పల్లవి గర్భసంచిలో నీటి బుడగలున్నట్లు గుర్తించి ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్లు సూచించారు. 

దీంతో మంగళవారం ఉదయం పల్లవిని హాస్పిటల్ లో ఆపరేషన్ కోసం భర్త నరేశ్ ​జాయిన్​ చేశాడు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆపరేషన్​చేసి గర్భసంచిలోని నీటి బుడగలను విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్లు చెప్పారు. తర్వాత దానికి సంబంధించిన బిల్లు కూడా కట్టించుకున్నారు. కొద్ది సేపటికే  పల్లవికి పల్స్ పడిపోయి గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబసభ్యులకు ఫెర్టిలిటీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. 

దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఫెర్టిలిటీ సెంటర్ ఎదుట ఆందోళన దిగారు.  వైద్యం వికటించడం వల్లే పల్లవి చనిపోయిందని ఆరోపించారు. దవాఖానపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.