
బెంగళూరులో ఒక వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం 2006లో తనకున్న స్థలాన్ని విక్రయించేశాడు. దాని నుంచి వచ్చిన డబ్బును పెళ్లికి వినియోగించుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే 19 ఏళ్లు గడిచిన తర్వాత ఆ వ్యక్తి కూతురు ప్రస్తుతం కొనుగోలు చేసిన వ్యక్తులను డబ్బు డిమాండ్ చేయటం.. తన అనుమతి లేకుండా విక్రయం జరిగిందంటూ లీగల్ నోటీసులు పంపించటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త చాలా మందికి కళ్లు తెరిపించేదిగా మారింది.
తనను అడగకుండా అమ్మినందుకు తనకు పరిహారం కావాలంటూ కుమార్తె డిమాండ్ చేయటం సరికాదని నెట్టింట పెద్ద చర్చకొనసాగుతోంది. అయితే అమ్మిన సమయంలో ఆమె మైనర్ కాదు. అమ్మిన వ్యక్తి కుమారుడు ఇది ఫ్యామిలీ గొడవని తాము సర్థుకుంటామని తొలుత చెప్పగా.. తర్వాత చట్టపరమైన చర్యలకు వెళుతున్నట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు చెప్పాడు. అయితే ఇటీవల మ్యాటర్ కోర్టు బయటే తేల్చుకుందామని సూచించాడు. గతంలో ఇలాంటి కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ వారిని భయానికి గురిచేసే ప్రయత్నం కూడా చేశాడు. ఒకవేళ కేసు ఓడిపోతే అంటూ వారిని గందరగోళానికి గురిచేయాలని చూశాడు.
కానీ కొనుగోలు చేసిన వ్యక్తి మరణించటంతో అతని కుమారుడు తాము పూర్తి డాక్యుమెంట్లను చట్టబద్దంగా కలిగి ఉన్నామని.. పైగా తమ పేరుపై కడుతున్న పన్నులు, ఖాతా సర్టిఫికెట్ ఉన్నాయని చెప్పారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు న్యాయం వీరివైపే ఉందని, బలమైన సాక్ష్యాలతో ఉన్నందున వారు కోర్టుకు వెళ్లినా విజయం సాధిస్తారని చెబుతున్నారు. లాయర్లు కూడా కొనుగోలు చేసిన ఫ్యామిలీకే చట్ట ప్రకారం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొందరు మాత్రం అమ్మిన వ్యక్తి ఫ్యామిలీ ఆమెకు ఆస్తుల విషయంలో అన్యాయం చేసి ఉంటారు అందుకే ప్రస్తుతం ఆమె కొన్న వ్యక్తుల నుంచి నష్టపరిహారం కోరుకుంటోందని అన్నారు. అందుకే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు సదరు ఫ్యామిలీ మెుత్తం నుంచి సంతకాలు తీసుకోవటం మంచిదని చెబుతున్నారు.