- తొలి సీజన్లో ఐదు జట్లు
ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విమెన్స్ ఐపీఎల్ ఆరంభ సీజన్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ మార్చి నెల విండోను కేటాయించింది. మార్చి తొలి వారంలో మొదలయ్యే లీగ్ నాలుగు వారాల పాటు జరుగుతుందని, తొలి సీజన్లో ఐదు జట్లు పోటీ పడతాయని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.
సౌతాఫ్రికాలో విమెన్స్ టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత లీగ్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందన్నారు. ప్రస్తుతానికైతే ఐదు జట్లతో ముందుకెళ్లాలని భావిస్తున్నామని, అయితే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆరో జట్టు కూడా చేరే అవకాశం ఉందన్నారు. కాగా, లీగ్ నిర్వహణ కోసం బోర్డు ఇప్పటికే విమెన్స్ డొమెస్టిక్ క్యాలెండర్లో మార్పులు చేసింది. ఈ సీజన్ను అక్టోబర్లో మొదలు పెట్టి ఫిబ్రవరితో పూర్తి చేయాలని నిర్ణయించి లీగ్కు మార్గం సుగమం చేసింది.