శామీర్ పేట, వెలుగు: గుడిసెలు, పెంకుటిల్లు, రేకులు ఇండ్లల్లో ఉంటున్న పేదలను కాదని.. రెండు, మూడంతస్తుల్లో ఉంటున్న వారికి గృహలక్ష్మి పథకాన్ని ఇస్తున్నారంటూ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్ జిల్లా కేశవరంలో మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. సర్పంచ్ అనుచరులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేశారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కేశవరం ఉప సర్పంచ్ ప్రమోద్కు మూడంతస్తుల ఇల్లు ఉండగా తల్లి మణెమ్మ పేరు మీద ఆయన గృహలక్ష్మి స్కీమ్ కు అప్లయ్ చేసుకున్నారని మహిళలు ఆరోపించారు.
సర్పంచ్ జ్యోతి ఇంట్లో బిహార్కు చెందిన కుటుంబం 2 నెలలుగా రెంటుకు ఉంటుండగా.. ఆ ఇంట్లోని వారి పేరు మీద గృహలక్ష్మి స్కీమ్ తీసుకున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులకే పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు.