
హాంగ్జౌ (చైనా): విమెన్స్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో అపజయం ఎరుగని ఇండియా తమ ఫామ్ను కొనసాగించాలని టార్గెట్గా పెట్టుకుంది. సూపర్ –4 రౌండ్లో భాగంగా బుధవారం (సెప్టెంబర్10) సౌత్ కొరియాతో జరిగే మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 11–0 తేడాతో థాయ్లాండ్పై ఘన విజయం సాధించి ఈ టోర్నీని ప్రారంభించిన ఇండియా అమ్మాయిలు ఆ తర్వాత సౌత్ కొరియాతో 2–-2తో డ్రా చేసుకున్నారు.
గత పోరులో సింగపూర్ను 12–-0తో చిత్తు చేసి పూల్–-బిలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ విజయాలు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. అదే జోరును సూపర్–4లోనూ చూపెట్టాలని ఆశిస్తున్నారు. ఇండియా తరఫున ఫార్వర్డ్స్ నవనీత్ కౌర్, ముంతాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. పూల్ దశలో ఇద్దరూ చెరో ఐదు గోల్స్తో రాణించారు. సింగపూర్పై చెరో హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మిడ్ఫీల్డర్లు నేహా, ఉదిత, షర్మిల, రుతుజా పిసాల్ కూడా సత్తా చాటుతున్నారు.
సూపర్– 4 దశలో ఇండియా, కొరియా, చైనా, జపాన్ తమ ప్రత్యర్థలతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఇందులో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ రౌండ్లో ఇండియాకు ప్రధాన ముప్పు వరల్డ్ నాలుగో ర్యాంక్ చైనా నుంచే ఎదురవనుంది. ఈ నేపథ్యంలో కొరియాతో పాటు జపాన్పై గెలిస్తే జట్టు ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఇక, ఈ టోర్నమెంట్ విన్నర్ వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్లో జరగనున్న వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది.
సొంతగడ్డపై ఆసియా కప్లో ఇండియా మెన్స్ టీమ్ చాంపియన్గా నిలిచి వరల్డ్ కప్ బెర్తు సొంతం చేసుకున్న నేపథ్యంలో అమ్మాయిలు కూడా అదే ఫలితాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అందుకు కొరియాపై విజయం తొలి అడుగు కానుంది. ఇండియా తమ సామర్థ్యం మేరకు ఆడితే తప్పక విజయం సాధిస్తుందని టీమ్ కోచ్ హరేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.