
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కారు రెడీ అవుతోంది. ఇది అమల్లోకి వస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మూడు పార్టీల్లో మహిళా నాయకుల సంఖ్య బాగా తక్కువగనే ఉంది. అధికార బీఆర్ఎస్ లో ఇంకా తక్కువ. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు. మిగతా 108 మంది పురుషులే కావడం గమనార్హం.
మహిళా రిజర్వేషన్ల బిల్లు పాసై అమల్లోకి వస్తే 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో 39 మంది మహిళలకు అవకాశం వస్తుంది. మూడు పార్టీలకు మహిళా అభ్యర్థులు దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న గజ్వేల్ తో పాటు పోటీ చేయాలనుకుంటున్న కామారెడ్డిలోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు సెగ్మెంట్లు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ సెగ్మెంట్ సిరిసిల్ల, హరీశ్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలోనూ దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ముగ్గురు కీలక నేతలు ఇతర సెగ్మెంట్లకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సతీమణులకు అవకాశం వస్తుందా..?
మహిళా బిల్లు అమల్లోకి వస్తే.. బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రకటించిన ఎమ్మెల్యే స్థానాల్లో వారి భార్యలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. చాలా సెగ్మెంట్లలో మహిళా అభ్యర్థులు దొరకడం కష్టమనే ఆందోళన బీఆర్ఎస్ లీడర్లను వెంటాడుతున్నది. 2014లో తొలి సారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. అందులో ఐదుగురు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు.
2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డి, బానోత్ హరిప్రియా నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో అధికార పార్టీలో మహిళా ఎమ్మెల్యేల బలం ఐదుకు చేరింది. ఆ ఎన్నికల్లో ములుగు నుంచి గెలుపొందిన సీతక్క మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఏ సెగ్మెంట్ ను మహిళలకు కేటాయిస్తారు..? అక్కడ తమకు దీటైన మహిళా అభ్యర్థి దొరకడం సాధ్యమేనా..? అన్నది మూడు పార్టీలనూ వేధిస్తున్న ప్రశ్న.