ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా–ఎ జట్టు.. ఏసీసీ విమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. బ్యాటింగ్లో తేజల్ హసబ్నిస్ (34 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 51 నాటౌట్), బౌలింగ్లో ప్రేమ రావత్ (3/12) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 46 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ విమెన్స్–ఎ జట్టుపై నెగ్గింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 134/7 స్కోరు చేసింది. స్టార్టింగ్లో బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
నందిని కశ్యప్ (8), దినేశ్ వ్రిందా (19), అనుష్క శర్మ (8), మిన్ను మణి (0) ఔట్ కావడంతో 44/4తో ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో తేజల్, రాధా యాదవ్ (36) ఐదో వికెట్కు 69 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. చివర్లో తనుజా కన్వర్ (1), ప్రేమ రావత్ (4) విఫలమయ్యారు. ఫహిమా ఖాతున్ 4, ఫర్జానా ఇస్మిన్, ఫతేమా జహాన్ చెరో వికెట్ తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 88 రన్స్కే ఆలౌటైంది. షామిమా సుల్తానా (20) టాప్ స్కోరర్. సర్మిన్ సుల్తానా (18), ఫహిమా ఖాతున్ (14), సాదియా అక్తర్ (10) ఫెయిలయ్యారు. ప్రేమకు తోడుగా సోనియా మెందియా, తనుజా కన్వర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తేజల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 2023 తొలి ఎడిషన్లోనూ ఇండియా విజేతగా నిలిచింది.
