తెలంగాణలో 70కిపైగా సీట్లు గెలుస్తం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

తెలంగాణలో  70కిపైగా సీట్లు గెలుస్తం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం రాష్ర్టంలో కాంగ్రెస్​హవా కొనసాగుతున్నదని, 70కిపైగా ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సరైన పాలనలేదని, అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయని ఫైర్​ అయ్యారు.  దేశంలోనే భారీ బహిరంగసభ విజయభేరిని హైదరాబాద్​లో నిర్వహించనున్నట్లు ఉత్తమ్​ తెలిపారు. 

 ‘తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రాహుల్​గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  కాంగ్రెస్​ ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్​లు ఆ సభకు వస్తున్నారు.  కాంగ్రెస్​ శ్రేణులంతా తుక్కుగూడలోని సభా ప్రాంగణానికి తరలిరావాలి’ అని ఉత్తమ్​ పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్​లో స్ట్రాటజీ కమిటీ మీటింగ్​నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 130 ఏండ్ల కాంగ్రెస్​ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ సమావేశాలను హైకమాండ్​ నిర్వహిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్​ రాష్ట్రాన్ని దేశంలో కలిపి 75 ఏండ్లవుతున్న సందర్భంగా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.  

ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తం

విజయభేరి సభలో సోనియా గాంధీ ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని ఉత్తమ్ వెల్లడించారు. హామీలను అమలు చేయడాన్ని కాంగ్రెస్​ పార్టీ గౌరవంగా భావిస్తుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, హిమాచల్​ ప్రదేశ్​లో ఓల్డ్​ పెన్షన్​ స్కీం వంటి వాటిని అమలు చేసింది కాంగ్రెస్​ పార్టీనేనన్నారు.  కర్నాటకలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రకటించిన ఐదు గ్యారెంటీలను అమలు చేసి చూపించామన్నారు. 

ఇంటింటికీ గ్యారెంటీ కార్డ్​: ఠాక్రే

ఇంటింటికీ గ్యారెంటీ కార్డ్​ను అందజేస్తామని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశాల ద్వారా దేశానికి మంచి సందేశం అందనుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటై తమ సభను అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన వ్యూహాలను తయారు చేస్తామని స్ట్రాటజీ కమిటీ చైర్మన్​ ప్రేమ్ సాగర్​ రావు అన్నారు. ఆ స్ట్రాటజీపై పది రోజుల్లో నివేదికను ఇస్తామన్నారు.