భద్రాచలం రెండో బ్రిడ్జి రెడీ!

భద్రాచలం రెండో బ్రిడ్జి రెడీ!
  • శ్రీరామనవమి రోజు వాహనాల రాకపోకలకు గ్రీన్​సిగ్నల్​
  • ఏర్పాట్లు చేస్తున్న ఎన్​హెచ్​ ఇంజినీర్లు

భద్రాచలం, వెలుగు : తొమ్మిదేండ్ల తర్వాత భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జి పనులు పూర్తి దశకు వచ్చాయి. అప్రోచ్​రోడ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17న శ్రీరామనవమి రోజు వంతెన పై నుంచి వాహనాలను పంపించేందుకు జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో నేషనల్ హైవే ఇంజినీర్లు సన్నాహాలు చేస్తున్నారు. 

2015 ఏప్రిల్​ 1న శంకుస్థాపన సమయంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. తర్వాత కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలోని బీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడంతో పనులు స్లోగా జరిగాయి. కాంట్రాక్టరు పనులు చేయకుండా మొండికేశారు. 2023 డిసెంబరు నాటికి బ్రిడ్జిపై భీమ్​లు పూర్తి చేసినా మిగతా పనులు ఆపేశారు. 

కాంగ్రెస్​ సర్కారు వచ్చి జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరారవు వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కలెక్టర్​ ప్రియాంక అలతో కలిసి పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్, ఎన్​హెచ్​ ఇంజినీర్లతో బ్రిడ్జి వద్దే సమీక్ష నిర్వహించారు. ఆలస్యంపై నిలదీశారు. శ్రీరామనవమి నాటికల్లా అప్రోచ్​ రోడ్లు పూర్తిచేసి, వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో కలెక్టర్ ప్రతీ రోజూ రివ్యూ చేస్తూ అవసరమైన మెటీరియల్​వచ్చేలా చూస్తూ పనులు పూర్తి చేయించారు. ఎట్టకేలకు శ్రీరామనవమికి రెండో వంతెనపై వాహనాల రాకపోకలకు క్లియరెన్స్ వచ్చింది.

అవాంతరాలు దాటి!

తొమ్మిదేండ్ల కింద భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన నిర్మాణానికి రూ.100కోట్లు మంజూరు చేశారు. ముంబైకి చెందిన రాజ్​దీప్​ ఇంజినీరింగ్ కంపెనీ రూ.65కోట్లతో నిర్మాణానికి టెండర్లు పొందింది. 36 పిల్లర్లు నిర్మించే సమయంలో నాణ్యతా లోపం వల్ల మూడు పిల్లర్లు పక్కకు వంగాయి. కెమికల్​ ట్రీట్​మెంట్​తో వాటిని సరిచేశారు. టెండర్లు పొందిన సంస్థ పెరిగిన సిమెంట్, ఐరన్​ ధరలతో నిర్మాణ వ్యయం పెరిగి అర్ధాంతరంగా పనులు నిలిపేసింది. 

ఎన్​హెచ్​ ఇంజినీర్లు పనుల​అలసత్వంపై కాంట్రాక్టు సంస్థకు నాలుగు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. 10శాతం పెనాల్టీ విధించి రూ.6.50కోట్లు వసూలు చేశారు. పిల్లర్లు పూర్తి చేసి వాటిపై భీమ్ ​గెడ్డెర్లు పెట్టేందుకు తరలిస్తున్న క్రమంలో భద్రాచలంలో 90 టన్నుల గెడ్డెర్​ కిందకు జారిపడి పగిలిపోయింది. ఇక పనులు పూర్తయ్యేనా? అనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఒకానొక దశలో పనులు పూర్తి చేయకపోతే బ్లాక్​ లిస్టులో పెడతామంటూ హెచ్చరించడంతో సంస్థ ముందుకొచ్చింది. కానీ కూలీలకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు సమ్మెకు దిగారు. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు కూర్చుని ఆ సమస్యను పరిష్కరించి పనులు మొదలుపెట్టి ఇప్పటికి పూర్తి చేశారు.

పెండింగ్​లో రెయిలింగ్, ఫుట్​పాత్ పనులు

బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినా రెయిలింగ్, ఫుట్​పాత్, రివిట్​మెంట్​ పనులు పెండింగ్​ ఉన్నాయి. భద్రాచలం, సారపాక వైపు అప్రోచ్​ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కానీ వాటికి ఇరువైపులా రెయిలింగ్​ ఏర్పాటు చేయాల్సి ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా 12 మీటర్ల వెడల్పుతో  5అడుగుల ఫుట్​పాత్​ను కూడా కట్టాలి. బ్రిడ్జికి రెండు వైపులా గోదావరి ఒడ్డుకు రివిట్​మెంట్​ చేయాల్సి ఉంది. శ్రీరామనవమి రోజు వాహనాల రాకపోకలను ప్రారంభించినా.. తర్వాత మళ్లీ మూసివేయనున్నారు. రెయిలింగ్, ఫుట్ పాత్, రివిట్ మెంట్​పనులు పూర్తి చేసి, ఎన్నికలు ముగిసిన వెంటనే అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. 

శ్రీరామనవమికి సిద్ధం చేస్తున్నాం

శ్రీరామనవమి రోజు భక్తుల వాహనాల రాకపోకలకు భద్రాచలం వద్ద రెండో వంతెనను సిద్ధం చేస్తున్నాం. అప్రోచ్​రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. శ్రీరామనవమి తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం. 
– యుగంధర్, ఈఈ, నేషనల్​ 
హైవేస్, భద్రాద్రికొత్తగూడెం