మారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా

మారు పేర్ల సమస్యను పరిష్కరించాలి.. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు వద్ద ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ బాధిత కార్మిక కుటుంబాలు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టాయి. అంతకు ముందు కొత్తగూడెంలోని బంగ్లోస్​ ఏరియాలో స్ట్రక్చర్​మీటింగ్​జరుగుతున్న ప్రాంతంలోనూ నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్​ఇచ్చిన హామీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మారు పేర్ల సమస్యపైన సింగరేణి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపించారు. 

ఆర్ఎల్​సీ వద్ద చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్​చేశారు. 30 ఏండ్లకుపైగా కంపెనీలో పనిచేసి కారుణ్య నియామకాల్లో తమ వారసులకు జాబ్ ఇవ్వాలంటే టెన్త్​క్లాస్​లో ఇంటి పేరు వేరే ఉందని యాజమాన్యం కొర్రీలతో ఇబ్బందులకు పెడుతుందని వాపోయారు. ఇప్పటికే పలువురు కార్మికులు మానసిక వేదనతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  

కార్మిక కుటుంబాలకు ఇఫ్టూ నేతలు గౌని నాగేశ్వరరావు, సంజీవ్​మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. బాధితుల సమస్యను డైరెక్టర్​  దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని గుర్తింపు సంఘం నేతలు కె. రాజ్​కుమార్​, వాసిరెడ్డి సీతారామయ్య హామీ ఇచ్చారు. ధర్నాలో శ్రావణ్​, తిరుమల శ్రీనివాస్​, ఈర్ల రాజయ్య, బాబు, హరీశ్​, పి. వెంకటేశ్, కొమురమ్మ, ప్రదీప్​, సుధాకర్, కళావతి, కిరణ్​పాల్గొన్నారు.