నిజాం షుగర్​ ఫ్యాక్టరీ రీఓపెన్​కు కృషి చేస్తున్నం.. మంత్రి దామోదర రాజనర్సింహ

నిజాం షుగర్​ ఫ్యాక్టరీ రీఓపెన్​కు కృషి చేస్తున్నం.. మంత్రి  దామోదర రాజనర్సింహ

రాయికోడ్, వెలుగు: రాష్ట్రంలోని నిజాం షుగర్​ఫ్యాక్టరీల రీఓపెన్​కు కృషి చేస్తున్నామని హెల్త్  మినిస్టర్  దామోదర రాజనర్సింహ అన్నారు.  శుక్రవారం ఆయన సంగారెడ్డి జిల్లా రాయికోడ్​ మండలం మాటూర్​ గ్రామ శివారులో గోదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్​ షుగర్ ​ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరుకు రైతులకు న్యాయం చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జహీరాబాద్​ ఏరియాలోని చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ​ప్రారంభించలేదన్నారు.

దాంతో  కర్నాటక, మహారాష్ట్రకు చెరుకు తరలించి రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. చెరుకు రైతులకు రావాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గోదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్​ షుగర్​ ఫ్యాక్టరీతో నారాయణ  ఖేడ్, ఆందోల్, జహీరాబాద్​ నియోజకవర్గ చెరుకు రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎంపీ బీబీ పాటిల్​మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 3 వేల మంది కార్మికుల అవసరముంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్​ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులు నవీణ్​చంద్​ గోయాల్, సచిన్​ గోయాల్ అండ్​ బ్రదర్స్​, వివేక్,​ మాజీ  ఎంపీ సురేశ్​షెట్కార్, షుగర్​ కేన్​ కమిషనర్ భద్రు మలహోత్ర తదితరులు  పాల్గొన్నారు.