మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా ఏర్పడి దసరా నాటికి ఆరేండ్లు కావస్తున్నా కొత్త కలెక్టరేట్ తుది రూపుదిద్దుకోలేదు. నస్పూర్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు నాలుగున్నర ఏండ్లు అవుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లు రాకపోవడం, కొవిడ్ లాక్డౌన్ ఎఫెక్ట్, భూవివాదాల కారణంగా ఆగుతూ సా...గుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు గడువును పెంచుతూ పోతున్నారు. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించిన అధికారులు తాజాగా వచ్చే ఏడాది మార్చి డెడ్లైన్ విధించారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయకపోతే ఈ గడువులోపు కూడా కంప్లీట్ కావడం అనుమానమే. చుట్టుపక్కల జిల్లాలో స్పీడ్గా నిర్మాణాలు పూర్తి చేసుకొని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటుంటే... జిల్లాలో మాత్రం ప్రోగ్రెస్ లేకపోవడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. నాలుగున్నర సంవత్సరాలుగా... ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు భూమి కేటాయింపు నుంచే ఆటంకాలు ఎదురయ్యాయి. ముందుగా గోదావరి ఒడ్డునున్న భూదాన్ భూములను ఎంపిక చేశారు. అక్కడి సాయిల్ భారీ కట్టడాలకు అనుకూలంగా లేదని ఆర్అండ్బీ ఆఫీసర్లు రిపోర్ట్ఇవ్వడంతో విరమించుకున్నారు. తర్జనభర్జనల తర్వాత చివరకు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనంబర్ 42లో 26.27 ఎకరాలను కేటాయించారు. స్థలం ఎంపికలో స్పష్టత లేకపోవడంతోనే ఏడాదికి పైగా టైమ్ వృథా అయ్యింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరి 27న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా జిల్లా ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
పూర్ ప్రోగ్రెస్....
దాదాపు 50 డిపార్ట్మెంట్లకు చెందిన గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉండేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలకు పూనుకుంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారుల నివాసాల కోసం క్వార్టర్లు సైతం ఇదే సముదాయంలో నిర్మిస్తున్నారు. ఆయా బిల్డింగుల్లో స్లాబ్లు, వాల్స్ నిర్మాణాలతో పాటు 75 శాతం పనులు జరిగాయి. ఇంకా కీలకమైన ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, సీలింగ్, ఎలక్ర్టిఫికేషన్ తదితర వర్క్స్ నడుస్తున్నాయి. రూ.48.44 కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.33.50 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఎన్హెచ్ 63 నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భూవివాదాల వల్ల ఈ పనులు లేట్ అయ్యాయని, త్వరలోనే స్టార్ట్ చేస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు.
బిల్స్ పెండింగ్...
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు లేట్ కావడానికి ఫండ్స్ కొరత కూడా కారణమని తెలుస్తోంది.కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మధ్య మధ్యలో పనులు ఆపేస్తున్నారు. ప్రస్తుతం రూ.6 కోట్లకు పైగా బిల్స్ పెండింగ్ ఉన్నట్టు సమాచారం. అలాగే కొవిడ్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కూడా పనులు కొంతకాలం ఆగిపోయాయి. కలెక్టరేట్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ ఓ దగ్గర ఉండగా, జిల్లా ఆఫీసులు ఒక్కోటి ఒక్కో దగ్గర ఉన్నాయి. కొన్ని పట్టణంలో ఉండగా, మరికొన్ని శివారు ప్రాంతాల్లో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే వారికి ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. దీంతో నాలుగు ఆఫీసులకు తిరగాలంటే రోజంతా గడిచిపోతోంది. ఆఫీసుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.