హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ ఈవెంట్స్ రంగంలో సరికొత్త అధ్యాయానికి భాగ్యనగరం వేదికైంది. నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఈవెంట్స్ ఎకానమీ వీక్ (డబ్ల్యూఈఈడబ్ల్యూ) 2026 శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ టూరిజం భాగస్వామ్యంతో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ), హైటెక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి.
జూన్ 15 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. హైటెక్స్ హెడ్ శ్రీకాంత్ టీజీ, టీసీఈఐ అధ్యక్షుడు ఏ. బలరాం బాబు మాట్లాడుతూ.. వెడ్డింగ్ ప్లానింగ్, బిజినెస్ ఈవెంట్స్, పర్యాటకం, హాస్పిటాలిటీ, క్రియేటివ్ ఎకానమీ వంటి విభిన్న రంగాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి ఉమ్మడి ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ మెగా ఈవెంట్లో భాగంగా మూడు ప్రధాన వేదికలను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 70 మందికి పైగా స్పీకర్లు, వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు.
