- యాదాద్రి జిల్లాలో సర్పంచ్బరిలో 564.. వార్డుల్లో 2899
- పది పంచాయతీలు.. 191 వార్డులు ఏకగ్రీవం
- ప్రచారం షురూ..
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థుల బరిలో 568 మంది ఫైనల్ అయ్యారు. బుధవారం నామినేషన్లు విత్ డ్రా ప్రక్రియ ముగియడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల పోటీదారులు ఎవరో తేలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు 564, వార్డుల్లో 2899 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పోటీలో ఉన్న వారికి గుర్తులు కేటాయించారు.
సర్పంచ్గా బరిలో 568 మందియాదాద్రి జిల్లాలోని ఆరు మండలాల్లోని 153 పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 984 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొందరు రెండేసీ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీటిలో ఒక నామినేషన్ తిరస్కరించడంతో 983కు ఓకే చెప్పారు. బుధవారం 405 నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో 568 మంది బరిలో ఉన్నారు.
వార్డుల్లో 2899 మంది
జిల్లాల్లోని 153 పంచాయితీల్లో 1286 వార్డులు ఉన్నాయి. వీటికోసం తుర్కపల్లి మండలం మల్కాపూర్లోని 8వ వార్డులో ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్ దాఖలు కాలేదు. మొత్తంగా 3292 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 13 నామినేషన్లను తిర్కసరణకు గురికాగా 3289 నామినేషన్లు ఓకే అయ్యాయి. 390 నామినేషన్లు ఉపసంహరించుకోగా 1094 వార్డుల్లో 2899 మంది బరిలో ఉన్నారు.
14 మంది సర్పంచ్లు ఏకగ్రీవం
యాదాద్రి జిల్లాలోని 153 పంచాయతీల్లో 14 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. తుర్కపల్లి మండలంలో మూడు పంచాయతీలు, యాదగిరిగుట్టలో రెండు, బొమ్మల రామారంలో నాలుగు పంచాయతీలు, ఆత్మకూరు(ఎం)లో రెండు, రాజాపేటలో రెండు, ఆలేరులో ఒకటి ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 12 పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచ్లుగా ఏకగ్రీవం అయ్యారు.
191 వార్డులు ఏకగ్రీవం
జిల్లాలోని 153 పంచాయతీల్లో 191 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆలేరు మండలంలో ఆరు వార్డులు, ఆత్మకూర్ (ఎం)లో 25, బొమ్మల రామారంలో 51, రాజాపేటలో 11, తుర్కపల్లిలో 72, యాదగిరిగుట్టలో 26 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
గుర్తులు కేటాయింపు.. ప్రచారం షురూ
నామినేషన్ల విత్ డ్రాతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు తెలుగు అక్షరమాల ప్రకారం గుర్తులు కేటాయించారు. గుర్తులు కేటాయించగానే.. అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్తూ తమ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.
తమ్ముడు విత్ డ్రా.. అన్న ఏకగ్రీవం
తుర్కపల్లి మండలం చోక్లానాయక్ తండా అన్నా తమ్ముడు నామినేషన్లు వేశారు. అయితే ఏకగ్రీవం చేయడానికి ఓ ముఖ్య లీడర్ ప్రయత్నించినా తొలుత ఇద్దరూ ఒప్పుకోలేదు. చివరకు అన్న కోరడంతో తమ్ముడు విత్ డ్రా చేసుకోవడంతో భూక్యా రాజారామ్ నాయక్ సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు.
తుర్కపల్లి మండలంలో కొత్తగా ఏర్పాటైన గుజ్జవాని కుంట పంచాయతీని ఏకగ్రీవం చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన గుగులోతు దూప్సింగ్నాయక్కు ఓకే చెప్పారు.అయితే ఏదైనా పొరపాటు జరిగితే ప్రాబ్లం అవుతుందనే కోణంలో దూప్సింగ్ నాయక్, అతడి భార్య నామినేషన్లు వేశారు. రెండూ ఓకే కావడంతో బుధవారం ఒక నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో దూప్సింగ్ నాయక్ సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు.
ఉప సర్పంచ్ ఎన్నిక పెండింగ్
పంచాయతీ ఎన్నికల్లో ఏదైనా ఒక వార్డులో నామినేషన్లు ఎవరూ వేయకుంటే ఆ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక పెండింగ్లో పెడతారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం ముల్కాపూర్లో ఎస్టీ రిజర్వేషన్ అయిన 8వ వార్డుకు ఆ సామాజిక ఓటర్లు లేనందున నామినేషన్ వేయలేదు. రాజాపేట మండలం పుట్టగూడెంలోని వార్డుకు నామినేషన్ వేసినా.. స్క్రూటినీలో తిరస్కరించారు. ఇప్పుడు ఈ రెండు పంచాయతీలకు సంబంధించి ఉప సర్పంచ్ఎన్నిక పెండింగ్లో ఉంటుంది. హయ్యర్ ఆఫీసర్లు నిర్ణయం ఆధారంగా ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో ముందుకు సాగుతారు.
