ఆన్‌‌లైన్‌‌లో కోటి కుంకుమార్చన, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్‌‌ల టికెట్లు

ఆన్‌‌లైన్‌‌లో కోటి కుంకుమార్చన, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్‌‌ల టికెట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రావణమాసంలో నిర్వహించే కోటి కుంకుమార్చన టికెట్లతోపాటు గుట్టలో కొత్తగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్‌‌ల బుకింగ్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ‘శ్రావణ మహాలక్ష్మి కోటి కుంకుమార్చన’ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజలో పాల్గొనడానికి టికెట్ ధర రూ.2 వేలుగా నిర్ణయించారు. ఒక టికెట్‌‌పై దంపతులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శ్రావణమాసం మొత్తం రోజుకు రెండు దఫాలుగా కోటి కుంకుమార్చన నిర్వహించనున్నారు. www.yadadritemple.telangana.gov.in వెబ్‌‌సైట్‌‌లో లాగిన్ అయి కోటి కుంకుమార్చన పూజకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవాలని ఈవో సూచించారు. గుట్టలో అత్యాధునిక హంగులు, అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్‌‌లను కూడా ఆన్‌‌లైన్‌‌లో బుక్ చేసుకోవడానికి వైటీడీఏ వెబ్‌‌సైట్‌‌ను తీసుకొచ్చింది. booking.ytda.in ద్వారా లాగిన్ అయి సూట్ రూంలు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు.