యాదగిరి గుట్ట ఈవో పదవికి గీతారెడ్డి రాజీనామా

యాదగిరి గుట్ట ఈవో పదవికి గీతారెడ్డి రాజీనామా
  •     ఇన్​చార్జిగా బాధ్యతలు 
  •     స్వీకరించిన రామకృష్ణారావు  

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో పదవికి గీతారెడ్డి రిజైన్ చేశారు. దీంతో ఇన్​చార్జి ఈవోగా రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. రామకృష్ణా రావు ఇప్పటికే పలుమార్లు ఇన్​చార్జి ఈవోగా పని చేశారు. గీతారెడ్డి 2022 మే 5 నుంచి 9 వరకు, 26 నుండి జూన్ 14 వరకు సెలవు పెట్టగా రామకృష్ణారావు ఇన్​చార్జీగా వ్యవహరించారు. 

ఇబ్బంది పెడితే క్షమించండి : గీతారెడ్డి

రాజీనామా చేసి వెళ్లిపోతున్న గీతారెడ్డికి గురువారం ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈవో క్యాంప్ ఆఫీస్ లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  గీతారెడ్డి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం లో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేశానే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఎవరైనా తనవల్ల ఇబ్బందులు పడుంటే క్షమించాలన్నారు. ఆలయ ఫైళ్లను రామకృష్ణారావు అప్పగించారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఏఈవోలు శ్రావణ్ కుమార్, గజవెల్లి రమేశ్​ బాబు, జూశెట్టి కృష్ణ గౌడ్, గజవెల్లి రఘు, ఈఈలు దయాకర్ రెడ్డి, రామారావు, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, రాజన్ బాబు ఉన్నారు.