- నిరుడు ఇదే టైంలో 69.16 లక్షల టన్నుల కొనుగోలు
- ఈయేడు సర్కారు నిర్ణయం ఆలస్యం కావడం వల్లే
హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగిలో ఇప్పటి వరకు 36.13 లక్షల టన్నుల వడ్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులు అవుతుండగా సగటున రోజుకు లక్ష టన్నులు కూడా కొనలేకపోయింది. కొనుగోళ్లలో ఆలస్యం కావడంతో సెంటర్లను నమ్ముకోలేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు. దీంతో కొనుగోళ్ల టార్గెట్లో 60 శాతం కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అమ్ముకున్న వడ్ల పైసల్లో ఇంకా 43% రైతులకు ముట్టలేదు.
ఇప్పటి వరకు కొన్నది 49.56 శాతమే
ఈ సీజన్లో కొనుగోళ్ల టార్గెట్లో ఇప్పటి వరకు 49.56 శాతమే వడ్లు కొన్నారు. నిరుడు మేలో ఇదే టైమ్కు 69.16 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఈయేడు కొనుగోళ్ల నిర్ణయం జాప్యం కారణంగా నిరుడు ఈ టైమ్కు కొన్న దాంట్లో సగమే కొనడం గమనార్హం. ఈయేడు యాసంగి వడ్ల కొనుగోళ్లు ఏప్రిల్ 15న ప్రారంభం కాగా మొదట 72.89 లక్షల టన్నుల ధాన్యం కొనాలని సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ టార్గెట్ పెట్టుకున్నది. సెంటర్లు ఆలస్యంగా ఓపెన్ చేయడం, ఓపెన్ చేసిన సెంటర్లలోనూ జాప్యం జరగడంతో వానలకు భయపడి రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు. దీంతో పెట్టుకున్న టార్గెట్ కు అనుగుణంగా వడ్లు వచ్చే పరిస్థితి లేదని తాజాగా 56.14లక్షల టన్నులకు కుదించుకున్నారు. పరిస్థితి చూస్తే తగ్గించుకున్న టార్గెట్ కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు.
1,351 సెంటర్లలోనే పూర్తయిన కొనుగోళ్లు
ఈ యాసంగిలో 6,834 సెంటర్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకొని 6,576 సెంటర్లు తెరిచారు. ఇందులో 6,113 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. 45 రోజుల్లో 1,351 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. నెలన్నర అయినా సెంటర్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,072 కోట్ల విలువైన వడ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.4,026.18 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కొనుగోళ్లు, ట్రక్ షీట్ల జాప్యం, నగదు బదిలీలో నిర్లక్ష్యం కారణంగా ఇంకా రూ.3,045.86 కోట్లు రైతులకు అందలేదు.