ఈసారి ఐరిస్​తో వడ్ల పైసల్ .. టార్గెట్​ 6లక్షల మెట్రిక్​ టన్నులు

ఈసారి ఐరిస్​తో వడ్ల పైసల్ .. టార్గెట్​ 6లక్షల మెట్రిక్​ టన్నులు
  • జిల్లాలో సర్కారు వడ్ల కొనుగోలు షురూ
  • 466 సెంటర్స్​ ఓపెన్​ చేయాలని ఆర్డర్స్​
  • ఓపీఎంఎస్​ సాఫ్ట్​వేర్ వల్ల కేంద్రాల ఏర్పాటులో లేట్​ 
  • 65 శాతం సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్లకు కొత్త కేటాయింపులు నో

నిజామాబాద్,  వెలుగు:  జిల్లాలో యాసంగి సీజన్​ వడ్ల కొనుగోళ్లు  షురు అయ్యాయి. బిల్లు చెల్లింపులో అక్రమాలకు తావులేకుండా గవర్నమెంట్​ ఈసారి కొత్తగా ఓపీఎంఎస్​ సాఫ్ట్​వేర్​ తీసుకొచ్చింది. వడ్లు అమ్మిన రైతు ఐరిష్​ రికార్డు చేసి, వాటి ఆధారంగానే  బ్యాంకు ఖాతాలో పైసలు  జమ చేసేందుకు ప్రభుత్వం ఈ యాప్​ తెచ్చింది.  ఏప్రిల్​ 1 నుంచి  ఓపీఎంఎస్​ పూర్తి స్థాయిలో ఈ సాఫ్ట్​ వేర్​ను  అధికారులు వాడటం ప్రారంభించారు.

ఈ సాఫ్ట్​వేర్​ లింక్​తోనే  కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. 
6 లక్షల మెట్రక్​ టన్నుల వడ్లు  టార్గెట్​ మొత్తం 466 సెంటర్లు తెరువాలని సివిల్​ సప్లయ్​ అధికారులు నిర్ణయించారు.  యాసంగి సీజన్​లో వరి పంట రికార్డు స్థాయిలో రైతులు సాగు చేశారు. 2.84 లక్షల ఎకరాలలో పంట వేస్తారని అంచనా వేయగా 4.16 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. దిగుబడి 11.72 లక్షల మెట్రిక్​ టన్నులు కాగా అందులో 70 శాతం సన్నాలే ఉన్నాయి. పంట విస్తీర్ణం ఎక్కువ ఉన్నందున జిల్లా నుంచి వడ్ల కొనుగోలు ఎక్కువ శాతం చేయాలని గవర్నమెంట్​ ఆలోచించి 6 లక్షల టన్నుల సేకరణ  లక్ష్యం పెట్టుకుంది. 

ఓటీపీకి చెక్​.. ఇక ఐరిష్​తోనే పేమెంట్​ 

వరి  కోతలు 20 రోజుల కింద మొదలైనా ఓపీఎంఎస్​ అనే కొత్త సాఫ్ట్​వేర్​ను ప్రవేశపెట్టడం వల్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటు రెండు వారాలు లేట్​ అయింది. కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులో అవినీతిలేకుండా చేయడానికి  కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఈ కొత్త సాఫ్ట్​వేర్​ను ఈ సీజన్​ నుంచి వాడుతోంది.  వడ్లు కాంటా పెట్టిన రైతు ఐరిష్​ సేకరించి అతని బ్యాంకు ఖాతాలో  నేరుగా పైసలు జమ చేయడం  దీని ఉద్దేశ్యం.

గత సీజన్​ దాకా ఓటీపీ నంబర్​తో కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులు చేసేవారు. ఇది కొన్ని అక్రమాలకు దారితీసింది. రైతుల స్థానంలో సెంటర్లు నడిపిన  నిర్వహకులు బిల్లులు పొందిన సందర్భాలు ఉన్నాయి. రైతు ఐరిష్​ సేకరణతో అవినీతికి చెక్ పడనుంది. పక్క స్టేట్​ రైతులు, వ్యాపారులు ఇక్కడి కేంద్రాలలో వడ్లు అమ్మకుండా ఓపీఎంఎస్​ విధానం నియంత్రిస్తుందని అధికారులు అంటున్నారు.  ​ 

స్టేట్​ బార్డర్లో చెక్​ పోస్టులు.. 

గవర్నమెంట్​'ఏ' గ్రేడ్​ వడ్లు  క్వింటాల్​కు  రూ.2,203 'బీ'గ్రేడ్​కు రూ.2,183 ధర చెల్లిస్తుంది.  దీంతో పక్క స్టేట్​ నుంచి వచ్చే వడ్లను అడ్డుకునేందుకు  బార్డర్​ చెక్​పోస్టులు పెట్టారు. పోతంగల్​, కందకుర్తి, సాలూరా వద్ద డే అండ్​ నైట్​ చెక్​పోస్టులు పనిచేసేలా కలెక్టర్​ రాజీవ్​ గాంధీ ఆర్డర్స్​ జారీ చేశారు.

బ్లాక్​ లిస్టులో ఉన్న మిల్స్​కు  వడ్లు బంద్​ 

 సీఎంఆర్​  రైస్​ 65 శాతం ఇచ్చిన మిల్లర్లకే ఈసీజన్​ వడ్లు పంపేందుకు అధికారులు రెడీ అయ్యారు.  బ్లాక్​ లిస్టు మిల్లులకు గింజ ధాన్యం కూడా పంపొద్దని ఇదివరకే ప్రభుత్వం ఆదేశించింది. వాటిని స్థానిక అధికారులు  కచ్చితంగా అమలు చేస్తామంటున్నారు.   జిల్లాలో పారా బాయిల్డ్​ రైస్​ మిల్స్​230, బాయిల్డ్​ మిల్లులు 72 ఉన్నాయి.  సుమారు రూ.100 కోట్ల సీఎంఆర్​ రైస్​ మాయం చేసిన తొమ్మిది మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. గవర్నమెంట్​ వడ్లను బయట  అమ్ముకున్న 13 బాయిల్డ్​, 31 పారా బాయిల్డ్​ రైస్​ మిల్లులను బ్లాక్​లిస్టులో పెట్టారు.  అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు సీఎంఆర్​ వడ్లు అసలు ఇవ్వొద్దని సర్కారు ఆదేశాలు ఉన్నాయి. ఆ లెక్కన కేసులు, బ్లాక్​లిస్టు మిల్లులకు గింజ కూడా ఇవ్వరు. కనీసం 65 శాతం సీఎంఆర్​ రైస్​ ఇచ్చిన రైస్​ మిల్లర్లకు మాత్రమే ఇప్పుడు కొనుగోలు చేసే వడ్లు పంపనున్నారు.