లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్గా రికార్డు
జార్ఖండ్పై చెలరేగిన ముంబై టీనేజర్ జైస్వాల్
బెంగళూరు: ముంబై టీనేజర్, ఇండియా అండర్–19 టీమ్ స్టార్ యశస్వి జైస్వాల్(203) లిస్ట్–-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు. 17 ఏళ్ల 192 రోజుల వయసున్న జైస్వాల్ విజయ్హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో జార్ఖండ్పై ధనాధన్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. దాంతో, 20 ఏళ్ల 273 రోజుల ఏజ్లో 1975లో సౌతాఫ్రికాలో డబుల్ సెంచరీ చేసిన అలన్ బారో రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. విజయ్హజారేలో కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ డబుల్ సెంచరీ బాదిన కొన్ని రోజుల వ్యవధిలోనే అతను డబుల్ కొట్టడం విశేషం. ఇండియా తరఫున లిస్ట్-–ఎలో రెండొందల స్కోరు చేసిన తొమ్మిదో ప్లేయర్గా ఈ టీనేజర్… సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీరేందర్ సెహ్వాగ్ వంటి గ్రేట్ ప్లేయర్లతో కూడిన లిస్ట్లో చేరాడు. యశస్వి సూపర్ పెర్ఫామెన్స్తో ముంబై 50 ఓవర్లలో మూడు వికెట్లకు 358 రన్స్ చేసింది. అనంతరం ఛేజింగ్లో జార్ఖండ్ను 319 రన్స్కే ఆలౌట్ చేసి 39 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ పోరులో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్న జైస్వాల్.. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఆదిత్య తారె (78)తో కలిసి ఫస్ట్ వికెట్కు 200 రన్స్ జోడించాడు. 35వ ఓవర్లో తారె ఔటైనా ఏ మాత్రం వెనక్కుతగ్గని యశస్వి అలవోకగా బౌండ్రీలు కొడుతూ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. టీమిండియాకు ఆడిన పేసర్ వరుణ్ ఆరోన్తో పాటు షాబాజ్ నదీమ్, అనుకూల్ రాయ్ వంటి టాలెంటెడ్ బౌలర్లను ఎదుర్కొని తన ఐదో లిస్ట్-–ఎ మ్యాచ్లోనే అతను ఈ ఘనత సాధించడం విశేషం. 149 బంతుల్లోనే 200 మార్క్ దాటిన ఈ కుర్రాడు ఓవరాల్గా 17 ఫోర్లు, 12 సిక్సర్లతో జార్ఖండ్ బౌలింగ్ను దంచికొట్టాడు. బౌండ్రీల రూపంలోనే 140 రన్స్ వచ్చాయంటే జైస్వాల్ జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.