హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలు, సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
మంగళవారం ఆయా జిల్లాలతో పాటు సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు, బుధవారం భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
టెంపరేచర్లు తగ్గుతయ్
వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది. మరోవైపు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లా కన్నయ్యపల్లి, మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్లో 40 డిగ్రీలు మినహా మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలలోపే రికార్డయ్యాయి.