- వారితోనే చాలా మంది ఫోన్లు ట్యాప్ చేయించిండు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్/పాలమూరు, వెలుగు: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించి, వారితో ఫోన్ ట్యాపింగ్ చేయించారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ సైన్యం ఒక్కొక్క విషయం బయట పెడుతుంటే, కేటీఆర్ ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. పోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం సిగ్గు పడుతోందన్నారు. మంగళవారం గాంధీ భవన్లో కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై లీగల్ నోటీసులిస్తానని కేటీఆర్ చెప్పడంపై శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
‘‘తెలంగాణ ఉద్యమం కంటే ముందు కేటీఆర్ ఆస్తులు ఎన్ని? ప్రస్తుత ఆస్తులు ఎన్ని? కేటీఆర్.. లీగల్గా ఫైట్ చేద్దామా?’’అని సవాల్ విసిరారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేయడం దేశ ద్రోహమన్నారు. పరువు నష్టం దావా వేసే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి లేకుంటే కేసీఆర్ ఏనాడో జైలుకు పోయేవారని ఆయన అన్నారు. అప్లికేషన్ ఫారాలను రూ.10 వేలకు అమ్ముకున్న కేసులో కేసీఆర్ను నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయకుండా కేకే మహేందర్ రెడ్డి లాంటి ఉద్యమకారులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. పదేండ్లు రాజకీయ దురహంకారంతో రాష్ట్రాన్ని కేసీఆర్ పాలించారని కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. పోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలకు, పౌర హక్కులకు కల్వకుంట్ల కుటుంబం తూట్లు పొడిచిందని మండిపడ్డారు.
కేటీఆర్ ట్వీట్కు యెన్నం కౌంటర్..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ చేసిన ట్వీట్కు యెన్నం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా.. యెన్నం ట్విట్టర్లో స్పందించారు. ‘‘ప్రజా కోర్టులో గెలిచిన మాదిరిగానే, లీగల్గా న్యాయస్థానంలోనూ గెలుస్తాం. మీరు మళ్లీ మళ్లీ ఓడిపోక తప్పదు. ధర్మో రక్షతి రక్షితః’’అంటూ యెన్నం ట్వీట్ చేశారు.