
హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని జోనల్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోని ఆఫీసర్స్ క్వార్టర్స్లో యోగా వేడుకలను నిర్వహించింది. ఈ సంవత్సరం థీమ్ “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్”. పీ అండ్ ఐఆర్ రీజనల్ మేనేజర్ శరవణ రమేష్ మాట్లాడుతూ..‘‘ యోగా వలన శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ప్రయోజనాలు ఉంటాయి. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యం”అని అన్నారు. యోగా మనల్ని ప్రకృతితో సామరస్యంగా జీవించాలని, సస్టైనబిలిటీ, సెల్ఫ్- కేర్ను ప్రోత్సహిస్తుందని రీజనల్ మేనేజర్ (ఈ అండ్ ఓఎస్) కుమార వైద్యలింగం పేర్కొన్నారు.
రోజువారీ ప్రాక్టీస్ కోసం సులభమైన యోగా ఆసనాలను యోగా గురు కరుణాకర్ నేర్పించారు. ఇవి అన్ని వయసుల ఉద్యోగులు, ఆఫీసులు/స్కూళ్లకు తొందరగా వెళ్లే పిల్లలు సులభంగా ఫాలో అవ్వగలరు. జోనల్ ఆఫీస్, హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్, జోనల్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఎల్ఐసీ అధికారులు, ఉద్యోగులు, ఆఫీసర్స్ క్వార్టర్స్ నివాసితులు ఈ యోగా వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.