ఢిల్లీలోని జేఎన్యూలో CAAని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చేశారు. ఆమె అక్కడికి వెళ్లడంపై పలువురు రాజకీయ నాయకులు భిన్నంగా స్పందించారు. పలువురు బీజేపీ నేతలు.. దీపికా సినిమాలను బాయ్కాట్ చేయాలని పిలుపునివ్వగా.. కొందరు ఆమెకు తన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందన్నారు. ఇప్పుడు తాజాగా ఆమెపై యోగా గురువు రామ్దేవ్ బాబా విమర్శలు చేశారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దీపికా పదుకొనె భారతదేశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. CAA (పౌరసత్వ సవరణ చట్టం) ఫుల్ ఫాం కూడా తెలియని వాళ్లు ప్రధాని మోడీని ఇష్టానుసారం తిడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆమెకు దేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అవగాహన లేదన్నారు. వీటిపై స్టడీ చేసి జ్ఞానం పెంచుకోవాలన్నారు రామ్దేవ్. భారతదేశం గురించి ఆమె తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. సరైన జ్ఞానం తెచ్చుకున్నాకే ఆమె దేశంలో జరుగుతున్న విషయాలపై ఓ నిర్ణయం తీసుకుని స్పందించాలని సూచించారు. ఇందుకోసం తనను గురువుగా స్వీకరించాల్సిన అవసరముందన్నారు. ఆమెకు మంచి సలహాలు ఇచ్చి, జ్ఞానాన్ని భోదించడానికి ‘స్వామి రామ్దేవ్’ లాంటి గురువు ఆమెకు అవసరమని తాను భావిస్తున్నానని చెప్పారు. నటన వేరు విషయ పరిజ్ఞానం వేరని అన్నారాయన.
మోడీపై ప్రశంసలు
CAA వల్ల ఎవరికీ నష్టం లేదని, ఈ చట్టం కారణంగా ఏ ఒక్కరి పౌరసత్వం పోదని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వివరంగా చెబుతున్నారని అన్నారు రామ్ దేవ్. అయినా దీన్ని అర్థం చేసుకోకుండా కొందరు హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలైన డీమానిటైజేషన్, జీఎస్టీ వల్ల దేశానికి మంచి జరుగుతోందని అన్నారు. వీటిని ప్రజలు ముందు వ్యతిరేకించినా ఇప్పుడు అర్థం చేసుకున్నారని చెప్పారాయన. జీఎస్టీకి జనం అలవాటు పడ్డారని, ప్రస్తుత స్లో డౌన్ విషయంలోనూ మోడీ ప్రభుత్వ సంస్కరణలు భారత్కు మేలు చేస్తాయని అన్నారు.