పతంజలి పబ్లిసిటీ.. యాడ్స్ విషయంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పతంజలి ప్రాడక్ట్స్ కు సంబంధించి.. టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం.. పతంజలి ప్రాడక్ట్స్ లో ఉన్న ఔషధాలకు సంబంధించి కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలంటూ.. రాందేవ్ బాబాతోపాటు ఆ కంపెనీ నిర్వాహకులు బాలకృష్ణన్ కు నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. పతంజలి యాడ్స్ పై 2024, మార్చి 19వ తేదీ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఈ నోటీసులు జారీ చేసింది కోర్టు.
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుపై స్పందించడంలో విఫలమైనందుకు పతంజలి ఆయుర్వేదం, యోగా గురువు రామ్దేవ్ను హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే రామ్ దేవ్ బాబాకు, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు ధర్మాసనం సమన్లు జారీ చేసింది.
పతంజలి తన ఉత్పత్తులపై ప్రచూరించే యాడ్స్ పై కోర్టులో ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు గత నెలలో సుప్రీం కోర్టు పతంజలిని నిలదీసింది. పతంజలి, బాలకృష్ణలపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుపై పతంజలి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. స్పందన రాకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది.
తదుపరి విచారణ సమయంలో కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్లోని సెక్షన్ 3 అండ్ 4ను రామ్దేవ్ మరియు బాలకృష్ణ ఇద్దరూ ప్రాథమికంగా ఉల్లంఘించారని, ఇది మెడిసిన్ల తప్పుదోవ పట్టించే ప్రకటనలతో వ్యవహరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.