
నీళ్లు తెచ్చే బాధ్యత నాది… గెలిపించే బాధ్యత మీదన్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు. కడప జిల్లా బద్వేలులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమంలో మనమే టాప్ లో ఉన్నామన్నారు. ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ది చేశానన్నారు. రూ.200 పింఛన్ ను రూ.2వేలకు పెంచామన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. కేంద్రం సహకరించకపోయినా రూ.24,500కోట్ల రుణమాఫీ చేశామన్నారు. నదులను అనుసంధానం చేసిన ఘనత మాదేనన్నారు. బద్వేల్ లో గోదావరి నీళ్లతో వ్యవసాయం చేయబోతున్నామన్నారు. సోమశిల నీళ్లు కూడా జిల్లాకు వస్తాయన్నారు.
YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జట్టు ప్రధాని మోడీ చేతిలో ఉందన్నారు చంద్రబాబు. మోడీని నిలదీస్తే జగన్ ను జైలులో పెడతాడని జగన్ కు వణుకు పుడుతోందని ఆరోపించారు. కేసీఆర్ మనపై దాడులు చేయాలని చూస్తున్నారన్నారు. విభజన జరిగిన తర్వాత మనకు రూమ్ కూడా లేకుండా చేశారన్నారు. మనవాళ్లపై దాడులు చేశారు.. ఆంధ్రులు ద్రోహులు అన్నారని చంద్రబాబు అన్నారు. విభజన ఏకపక్షంగా జరిగిందన్నారు. అమరావతిని అభివృద్ది చేస్తుంటే ఓర్వలేక మనపై కుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఇక గిఫ్ట్ ఇస్తే నేను వందల గిఫ్ట్ లు ఇస్తానన్నారు చంద్రబాబు.