ప్రియురాలి బర్త్​డే రోజే ప్రియుడి సూసైడ్​

ప్రియురాలి బర్త్​డే రోజే ప్రియుడి సూసైడ్​

భీమదేవరపల్లి,వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ప్రియురాలు మోసం చేసిందని, ఆమె పుట్టిన రోజు నాడే  ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మండ సాయి (26) హనుమకొండకు చెందిన ఓ అమ్మాయితో మూడేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. తమ బంధువుల ఊరైన ముల్కనూరుకు ఆమె తరచుగా వచ్చి పోతుండేది.

అయితే వీరి ప్రేమ వ్యవహారంలో మరో యువకుడు జోక్యం చేసుకోవడంతో గొడవలు వచ్చాయి. కొన్ని రోజుల కింద ప్రియురాలు పిలిచిందని హనుమకొండలోని ఆమె ఇంటికి వెళ్లాడు. మరో యువకుడు కూడా రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్  ఇచ్చి పంపించారు. దీంతో తీవ్ర మానసిక వేదన చెందిన సాయి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ప్రియురాలు, సదరు యువకుడే తమ కొడుకు చనిపోవడానికి కారణమని మృతుడి తండ్రి కరంచంద్​  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి ఒంటిపై గాయాలు కూడా  ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.