అవుసులోనిపల్లిలో పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య

అవుసులోనిపల్లిలో పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య

గజ్వేల్​, వెలుగు: ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గౌరారం ఎస్సై కరుణాకర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన చెక్కల కల్పన(18) ఇంటర్  పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటూ కుట్టు మిషన్  నేర్చుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి శివకుమార్(21) ఇంటర్​ పూర్తి చేసి తండ్రికి వ్యవసాయంలో తోడుగా ఉంటున్నాడు. 

కల్పన, శివకుమార్  ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు వారి ప్రేమకు ఒప్పుకోలేదు. ఇటీవలే కల్పనకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. దీంతో ఉప్పరి శివకుమార్  మంగళవారం తన పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం కల్పనకు తెలియడంతో ఇంట్లో ఉరేసుకుంది. గ్రామానికి చెందిన యువతి, యువకుడు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.