2 పేజీల లెటర్ రాసి.. బలవన్మరణం

2 పేజీల లెటర్ రాసి.. బలవన్మరణం
  • ఇచ్చిన అప్పు తిరిగి రాక .. కుటుంబ సభ్యుల ఒత్తిడి భరించలేక యువకుడి ఆత్మహత్య
  • డబ్బులివ్వను.. చస్తే చావు.. అనడంతో మనస్తాపానికి గురైన సత్యనారాయణ

మెదక్: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోవడం.. మరో వైపు కుటుంబ సభ్యులు ఒత్తిడి భరించలేక యువకుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.  తూప్రాన్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వెంకటాయాపల్లి గ్రామానికి చెందిన లంబ సత్యనారాయణకు మనోహరబాద్ మండలం తుపాకుల పల్లి గ్రామానికి చెందిన భాగ్యతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక ఏడాది వయసున్న చిన్నారి పాప ఉంది. 
సత్యనారాయణ దగ్గర వెంకటయ్య పల్లి గ్రామానికి చెందిన నాగరాజు  అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బులను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు కోరినా ఇవ్వకపోవడంతో ఇంట్లో గొడవలు తలెత్తాయి. అప్పు తీసుకున్న నాగరాజు ను తానిచ్చిన పైసలు తిరిగి చెల్లించమని బ్రతిమలాడినా ఇవ్వలేదు. పైగా ఏం చేసుకుంటావో చేసుకో.. చస్తే చావు అని అన్నాడు. అప్పు వసూలు కాకపోవడంతో సత్యనారాయణ భార్య భాగ్య తోపాటు అత్తింటి చెందిన మరి కొంతమంది సత్యనారాయణ ను వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై.. ఒత్తిడి భరించలేక మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి వెంకటాయపల్లి గ్రామానికి చెందిన నాగ రాజు, సత్యనారాయణ అత్తింటివారికి చెందిన ముగ్గురు కారణమని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు.