
ఈ నెల 5న వికారాబాద్ జిల్లా రంగంపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గుర్తు తెలియని యువతి హత్య కేసును పరిగి పోలీసులు చేధించారు. చనిపోయిన యువతి గుల్బర్గాకు చెందిన డిగ్రీ విద్యార్థినిగా గుర్తించిన పోలీసులు, ప్రేమ వ్యవహారమే ఆమె మృతికి కారణమని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బ్రహ్మపూర్ కు చెందిన రాణిశోభ(22) ఓ వ్యక్తిని ప్రేమించి, అతని వల్ల 6 నెలల గర్భం దాల్చింది. ఈ విషయం బయట తెలియకూడదని ఆమె ప్రియుడు ఆమె చేత అబార్షన్ చేయిద్దామని ఒప్పించాడు. అతని మాటలకు సరేనన్న ఆ యువతి బ్రహ్మపూర్ లోని మాతోశ్రీ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకునేందుకు ఒప్పుకుంది. అబార్షన్ చేసే సమయంలో వైద్యం వికటించడంతో ఆమె మృతి చెందింది.
ఈ సంఘటన బయటకు రాకుండా ఉండేదుకు మృతురాలి ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి మృతదేహాన్ని కారులో కర్ణాటక నుంచి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు తీసుకొచ్చారు. ఆ తర్వాత శవాన్ని గోవిందాపూర్ తండా గేట్ సమీపంలో కాలువలో వేసి వెంట తెచ్చిన పెట్రోలు ఒంటిపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పరిగి పోలీసులు.. శవాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి దర్యాప్తు సాగించారు. సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా ఆ యువతి గుల్బర్గాకు చెందిన యువతి గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును బ్రహ్మపూర్ పోలీసులకు అప్పగించారు.