మూసాపేట, వెలుగు: వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్ పెట్టి యువకుడు చనిపోయిన ఘటన కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రగతినగర్లోని ప్రగతి హోమ్స్లో ఉండే ముత్యాల నరహరి కొడుకు సాయికృష్ణ(29)ప్రైవేటు ఎంప్లాయ్. ‘గుడ్ బై మై మమ్మీ.. డాడీ, మళ్లీ నెక్ట్స్ లైఫ్ లో మీకు కొడుకుగానే పుట్టాలనుకుంటున్నా.. నన్ను ఎలా చూసుకున్నారో.. నా చిన్న పాపను అలాగే చూసుకోండి.. నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా.. సారీ చిన్నపాప..’’ అంటూ గురువారం మధ్యాహ్నం తన వాట్సప్లో స్టేటస్గా పెట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు.
స్టేటస్ను చూసిన తండ్రి నరహరి వెంటనే సాయికృష్ణ కోసం వెతికాడు. ప్రగతినగర్ చెరువు వద్దకు వెళ్లినట్టు గుర్తించాడు. నరహరి అక్కడికి చేరుకునేలోగా.. అప్పటికే సాయికృష్ణ చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు డెడ్బాడీని బయటికి తీయించి గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.