బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల షారుఖ్ సినిమా ‘పఠాన్’లో సల్మాన్ గెస్ట్ రోల్లో కనిపించడం ఆ సినిమాకు ఎంతో ప్లస్ అయింది. అలాంటిది పూర్తిస్థాయిలో నటిస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. అందుకే ఈ కాంబినేషన్లో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఓ భారీ మల్టీస్టారర్ను ప్లాన్ చేసింది. ఇద్దరు హీరోల అభిమానులను ఖుషీ చేసేలా గురువారం ‘టైగర్ వర్సెస్ పఠాన్’ సినిమాను అనౌన్స్ చేశారు నిర్మాత ఆదిత్య చోప్రా. సిద్ధార్థ్ ఆనంద్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఏక్ థా టైగర్, వార్, పఠాన్ చిత్రాలతో ఓ స్పై యూనివర్స్ని క్రియేట్ చేసిన యశ్ రాజ్ సంస్థ... ఆ చిత్రాల్లోని టైగర్, పఠాన్ క్యారెక్టర్స్తో ఈ సినిమా చేస్తోంది. దీని కోసం దాదాపు 28 ఏళ్ల తర్వాత షారుఖ్, సల్మాన్ కలిసి నటిస్తుండటం విశేషం. 1995లో ‘కరణ్ అర్జున్’లో ఈ ఇద్దరూ హీరోలుగా నటించారు. ఆ తర్వాత ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో కలిసి నటించబోయే సినిమా మాత్రం ఇదే కానుంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ మొదలవబోతోంది.