
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం చనిపోయారన్నారు. అలాంటి పరిస్థితిలో పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన దొరగారు.. కనీసం ఇప్పుడైనా పట్టించుకోవాలన్నారు. చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు షర్మిల.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి చేతులు దులుపుకుని వదిలేయకుండా... కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాలని కేసీఆర్ ను కోరారు వైఎస్ షర్మిల. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలన్నారు. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చేయడంతో పాటు.. గతంలో కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు పడిన కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించాలన్నారు.