పంట నష్టాన్ని పరిశీలించిన షర్మిల.. ఎకరాకు 10 వేలు 30 వేలు ఇవ్వాలి

పంట నష్టాన్ని పరిశీలించిన షర్మిల.. ఎకరాకు 10 వేలు 30 వేలు ఇవ్వాలి

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా పంటలు నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్​ చేశారు.  ఏప్రిల్​29వ తేదీ శనివారం జనగామ జిల్లాలో షర్మిల పర్యటించారు. ఇందులో భాగంగా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి..రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని.. తమను ఆదుకోవాలని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు వైఎస్​ షర్మిల. చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారమె. ఇంత నష్టం జరిగినా కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. గత నెల 23 న హెలికాప్టర్ లో వచ్చిన సీఎం..10 వేల సహాయం అంటూ ప్రకటన చేశాడు..కానీ 10 వేలు అంటూ చెప్పి నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు షర్మిల.

 గత 9 ఏళ్లుగా దాదాపు 14 వేల కోట్ల పంట నష్టం జరిగిందని షర్మిల అన్నారు. వర్షానికి ప్రతి ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతుందన్నారు. ముష్టి రైతు బంధు ఇచ్చి కేసీఅర్ రైతును ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని ఫైర్​అయ్యారు. కేసీఅర్ రైతు ద్రోహి అని విమర్శించారు షర్మిల. ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు లబో దిబో అంటున్నారు. రైతు పరిహారంపై కేసీఅర్ కు అసలు ఏ విజన్ లేదని ధ్వజమెత్తారు వైఎస్​షర్మిల. 30 వేలు నష్టం జరిగింది అని చెప్తుంటే 10 వేలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేలు కాదు వెంటనే 30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్​చేశారు.

నష్టపోయిన పంటలకు పరిహారం కోసం ప్రభుత్వంపై పోరాడతానని ఈ సందర్భంగా షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు 1,250 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు షర్మిల.వడగండ్ల వానలకు రైతు నష్ట పోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.